హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): బీజేపీ నేతల వ్యవహారశైలి ఆత్మస్తుతి పరనింద పద్ధతుల్లో సాగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ తెలిపారు. జన ఆశీర్వాద యాత్రపేరుతో ఆ పార్టీ దేశవ్యాప్తంగా అబద్ధాల యాత్ర చేపట్టిందని విమర్శించారు. కొత్త సభ్యులను పరిచయం కూడా చేయనీయకుండా ప్రతిపక్షాలు పార్లమెంటును అడ్డుకున్నాయంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సమస్యలపై నిలదీసిన ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. పెగాసిస్ వివాదంపై సుప్రీంకోర్టు కూడా కేంద్రాన్ని ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇజ్రాయిల్లో పర్యటించిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీ అని.. ఆ సమయంలోనే పెగాసిస్ ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఆ ఒప్పందంలో భాగంగానే ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టుల ఫోన్ సంభాషణలపై పెగాసిస్ నిఘా పెట్టిందని పేర్కొన్నారు. ఈ సమస్యను పార్లమెంటులో ప్రస్తావిస్తే తప్పు ఎలాఅవుతుందని.. ప్రజాసమస్యలపై చర్చలు జరపలేని ప్రభుత్వ పెద్దలు తమ చేతకానితనాన్ని ప్రతిపక్షాలపై వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.