చౌటుప్పల్ రూరల్ (జైకేసారం), అక్టోబర్ 22: రాజగోపాల్రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకుడు బూర నర్సయ్యగౌడ్కు నిరసన సెగ తాకింది. చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామంలో ప్రచారానికి వచ్చిన బూర మాట్లాడుతూ.. ఆ గ్రామానికి టీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని ఉద్దేశిస్తూ పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ‘గ్రామ ఇన్చార్జిగా ఉన్న ఈ ఊర్లో నీ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటా.. మునుగోడు అభివృద్ధిపై చేతనైతే బహిరంగ చర్చకు రా’ అని కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
అది గమనించిన టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం శ్రేణులు, గ్రామస్థులు మండిపడ్డారు. ‘నిన్నటి వరకు ఎవరి పాట పాడినవ్.. ఇప్పుడెవరి పాట పాడుతున్నవ్.. బిడ్డా ఖబడ్దార్’ అంటూ ఒక్కసారిగా మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బూర ప్రచారాన్ని అడ్డుకొని నిలదీశారు. గత్యంతరం లేక బూర నర్సయ్య అలాగే ఉండిపోయారు. ప్రచార రథం నుంచి దిగి, కారులో కూర్చుండిపోయాడు. మహిళలు గ్యాస్ సిలిండర్లతో తరలివచ్చి నిరసన తెలిపారు. ఇక చేసేదేమీలేక వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.