‘మొదట మాకు సంబంధం లేదంటిరి.. తడిగుడ్డలతో ప్రమాణమంటిరి. మళ్లీ కోర్టు కేసులలో పోబట్టిరి. అధ్యక్షుడేమో ప్రమాణం చేస్తడు.. ప్రధాన కార్యదర్శేమో కోర్టుకెక్కుతడు. ఇదేం పని.. గాయింత ప్రజలకు అర్థం కాదా? ప్రజలు తేల్చరా? పరువు కాపాడుకోవడం కోసం విచారణ ఆపాలని ప్రయత్నం చేస్తున్నరు. నిజానికి మీరేం (బీజేపీ) చేయగలిగింది లేదు. మీముందు ఒకటే ఆప్షన్ ఉన్నది. నిజాన్ని ఒప్పుకొని, చెంపలేసుకొని.. ఈ తాప ఏడ.. ఇసొంటి పనిచేయము.. ఇంకోసారి ప్రభుత్వాన్ని పడగొట్టము అని చెప్పడం తప్ప బీజేపీ ముందు గత్యంతరం లేదు.
– మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయిందని రాష్ట్ర వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఓ పక్క ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తడిబట్టలతో ప్రమాణం చేస్తుంటే.. మరోపక్క పార్టీ ప్రధాన కార్యదర్శి కేసు విచారణను ఆపాలని, సీబీఐకి అప్పగించాలని కోర్టుల్లో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోళ్ల వ్యవహారంలో సిట్ విచారణ వద్దని బీజేపీ ఎందుకు అంటున్నదని నిలదీశారు. సీబీఐ విచారణే వారికి ముద్దా? అని ప్రశ్నించారు. బీజేపీది పూర్తిగా తెలంగాణ వ్యతిరేక ధోరణి అని పేర్కొన్నారు. రాష్ట్రంపై ఒక కక్షపూరితమైన వైఖరితో వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గురువారం వ్యవసాయమంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో నిస్సిగ్గుగా బయటపడ్డ బీజేపీ.. ముందు నిజాన్ని ఒప్పుకొని చెంపలేసుకొని క్షమాపణలు చెప్పడం తప్ప మరో గత్యంతరం లేదని స్పష్టంచేశారు. ‘పరువు కాపాడుకోవడం కోసం విచారణ ఆపాలని ప్రయత్నం చేస్తున్నరు. నిజానికి మీరేం (బీజేపీ) చేయగలిగింది లేదు. మీముందు ఒకటే ఆప్షన్ ఉన్నది. నిజాన్ని ఒప్పుకొని, చెంపలేసుకొని.. ‘ఈ తాప ఏడ.. ఇసొంటి పనిచేయము.. ఇంకోసారి ప్రభుత్వాన్ని పడగొట్టము’ అని చెప్పడం తప్ప గత్యంతరం బీజేపీ ముందు లేదు. మొదట మాకు సంబంధం లేదంటిరి. తడిగుడ్డలతో ఇమానమంటిరి. మళ్లీ కోర్టు కేసులకు పోబట్టిరి. అధ్యక్షుడేమో ప్రమాణం చేస్తడు.. ప్రధాన కార్యదర్శేమో కోర్టుకెక్కుతడు. ఇదేం పని.. గాయింత ప్రజలకు అర్థం కాదా? ప్రజలు తేల్చరా? దేవుణ్ణి కూడా ఎట్ల వాడుకుంటరో అర్థం కాబట్టె.. సంబంధమే లేకపోతే పార్టీ ప్రధాన కార్యదర్శి డైరెక్టుగ ఎందుకు కేసు వేస్తడు? ఏమైపోయిందని ఢిల్లీ నాయకులు.. గల్లీ నాయకులు.. గత్తరగత్తర ఆగమాగమయితున్రు’ అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఏం చేయకపోతే భయమెందుకు?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ హస్తం లేకుంటే విచారణకు ఆ పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారని హరీశ్రావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ఇక్కడ జరిగిన వ్యవహారంపై వ్యాఖ్యలు చేసినట్టు పత్రికల్లో వచ్చిందని, దీన్నిబట్టే బీజేపీ వ్యవహారం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. నిజాల్ని నిగ్గు తేల్చేందుకే సిట్ను ఏర్పాటు చేశామని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సిట్ దర్యాప్తు ఆగదని స్పష్టంచేశారు. చిత్తశుద్ధి ఉంటే విచారణకు సిద్ధంకావాలని బీజేపీని సవాల్ చేశారు. రాజకీయ పార్టీలు ఉత్తమ విధానాలు పాటిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేందుకు కృషిచేయాలని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇందుకు భిన్నంగా బలవంతంగా ప్రభుత్వాలను కూలదోస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో అద్భుతమైన మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి నగ్నంగా దొరికిపోయిందన్నారు.
‘ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తమకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తడి బట్టలతో ప్రమాణం చేస్తే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి సిట్ విచారణను అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించారు? ఎక్కడైనా, ఎటువంటి తప్పు జరిగినా నిష్పాక్షిక విచారణ జరుపాలని ఎవరైనా కోరుతారు. కానీ బీజేపీ నేతలు మాత్రం విచారణను అడ్డుకునేందుకు రోజుకో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విడ్డూరంగా ఉన్నది’ అని హరీశ్రావు తీవ్రంగా దుయ్యబట్టారు. ఎనిమిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలదోసిన బీజేపీ.. తెలంగాణలో అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆగమాగం అవుతున్నరని విమర్శించారు. ‘బీజేపీ నాయకులు ఈ కేసు విచారణ సీబీఐకి ఇయ్యాలంటున్నరు. తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ బీజేపీకి నమ్మకం లేకపోతే.. తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే హక్కు ఉంటదా? బీజేపీది తెలంగాణ వ్యతిరేక ధోరణి.
ఇదొక కక్షపూరితమైన వైఖరి. బీజేపీ పదహారు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నది కదా.. ఆ రాష్ర్టాల్లో పోలీసులు ఏ కేసుల మీద విచారణ జరుపుతలేరా? ఆయా రాష్ర్టాల్లో మీమీద నమ్మకం లేదు.. సీబీఐకి ఇవ్వాలని అడుగుతున్నరా? తెలంగాణ పోలీసులు దొంగను పట్టుకోవడం తప్పా? ఎమ్మెల్యేలను కొంటమని చెప్పి.. బహిరంగంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతూ వీడియోలతో సహా బయటపడితే.. చెంపలేసుకొని తల దించుకోవాలె కానీ.. దొంగలను పట్టుకోవడం తప్పు.. వీళ్ల మీద విచారణ చేయడం ఆపాలని మాట్లాడతరా?’ అని హరీశ్రావు నిలదీశారు. తెలంగాణలో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా బీజేపీ తీరు ఉన్నదని, విచారణలో వారి బండారం ఎక్కడ బయటపడిపోతుందోనన్న భయంతోనే విచారణను అడ్డుకునేందుకు రోజుకో కోర్టును ఆశ్రయిస్తున్నారని హరీశ్రావు విరుచుకుపడ్డారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్టపగలు దొరికిపోయిన దొంగల పరిస్థితి ఇవాళ కుడితిలో పడ్డ ఎలుకలాగా మారిపోయింది.
ముందేమన్నరు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలు ఎవరో మాకు తెలియనే తెలియదు అని బుకాయించారు. తర్వాతేమో ఈ స్వామీజీలు, మఠాధిపతులు మారువేషాల్లో వచ్చినవాళ్లు.. తమకు తెలవనే తెలవదన్నరు. ప్రభుత్వం వాళ్లను అరెస్టు చేసి జైలుకు పంపిన తరువాత బీజేపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. పార్టీ అధ్యక్షుడేమో తడిబట్టలతో ప్రమాణం చేస్తనంటడు. బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏమో.. ఈ కేసును విచారణ చేయొద్దు.. విచారణ ఆపండి.. ఈ కేసును ఢిల్లీకి ఇవ్వండి.. అని కోర్టుల్లో కేసు వేస్తడు. ఏందీ జోకు?’ అని మండిపడ్డారు. నిజంగ మీకు సంబంధమే లేకుంటే ఎందుకు కోర్టు తలుపులు కొడుతున్నరని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మీడియా చర్చల్లో బీజేపీ నాయకులు ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ మఠాధిపతులను సీఎం కేసీఆరే పంపించిన్రని బురదజల్లే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. ‘గుమ్మడికాయల దొంగ అంటే ఎందుకు భుజాలు తడుముకొంటున్నరు? ఎందుకు మీరు భయపడుతున్నరు? ఎందుకు మీరు లబలబ లాడుతున్నరు? సమాధానం చెప్పాల్నా వద్దా?’ అని మంత్రి నిలదీశారు.
గవర్నర్ హుందాగా వ్యవహరించాలి…
గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, ఆ స్థానంలో ఉన్నవారు హూందాగా వ్యవహరించాలని మంత్రి హరీశ్రావు కోరారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు హరీశ్రావు స్పందించారు. పెగాసెస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి, దేశంలోని ఫోన్లను ట్యాప్ చేస్తున్నదెవరో అందరికీ తెలుసని, దీనిగురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. కొన్ని బిల్లులపై సందేహాలున్నట్టు గవర్నర్ తెలుపగా, మంత్రి సబితాఇంద్రారెడ్డి వెళ్లి వారి సందేహాలను గురువారం నివృత్తి చేశారని తెలిపారు. తాము రాహుల్ గాంధీపై పోటీచేసిన తుషార్ గురించి మాట్లాడితే.. ఆమె మాత్రం తనవద్ద ఏడీసీగా పనిచేసిన తుషార్ గురించి చెబుతున్నారని, గవర్నర్ చెబుతున్న తుషార్ ఎవరో తమకు తెలియదని హరీశ్రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ గల్లీ లీడర్ల, ఢిల్లీ లీడర్ల మాటలకు పొంతన లేదని.. రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ బహురూప వేషాలను గమనించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. విచారణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలనుబట్టి ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతున్నదన్నారు. విచారణలో అన్ని విషయాలూ బయటకొస్తాయని హరీశ్రావు ఆశాభావం వ్యక్తంచేశారు.
విచారణ ఆగదు: నిరంజన్రెడ్డి
వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించేందుకే సిట్ను ఏర్పాటు చేశామని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా విచారణ మాత్రం ఆగదని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. వాస్తవాలు బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీజేపీ వ్యవహారాన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు నేరపూరిత చర్యగా అభివర్ణించిన నిరంజన్రెడ్డి.. అనేక రాష్ర్టాల్లో బీజేపీ ఇదేవిధంగా వ్యవహరించిందని విమర్శించారు. బీజేపీ నాయకులు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబితే హుందాగా ఉంటుందని నిరంజన్ రెడ్డి సూచించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్టపగలు దొరికిపోయిన దొంగల పరిస్థితి ఇవాళ కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. ముందేమన్నరు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలు ఎవరో మాకు తెలియనే తెలియదు అని బుకాయించారు. తర్వాతేమో ఈ స్వామీజీలు, మఠాధిపతులు మారువేషాల్లో వచ్చినవాళ్లు.. తమకు తెలవనే తెలవదన్నరు. ప్రభుత్వం వాళ్లను అరెస్టు చేసి జైలుకు పంపిన తరువాత బీజేపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. పార్టీ అధ్యక్షుడేమో తడిబట్టలతో ప్రమాణం చేస్తనంటడు. బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏమో.. ఈ కేసును విచారణ చేయొద్దు.. విచారణ ఆపండి.. ఈ కేసును ఢిల్లీకి ఇవ్వండి.. అని కోర్టుల్లో కేసు వేస్తడు. ఏందీ జోకు.. తడిబట్టలు, పొడిబట్టలు, ప్రమాణాలు.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఏమో కోర్టుల్లో కేసులు.. – మంత్రి హరీశ్రావు