వనపర్తి : బీఆర్ఎస్ ఏర్పాటు, ఖమ్మంలో భారీ బహిరంగ సభతో బీజేపీలో ప్రకంపనలు మొదలయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో ఆ పార్టీకి స్థానం లేదని స్పష్టం చేశారు.నియోజకవర్గంలోని శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన వార్డు మెంబర్ గంధం రమేశ్, బండారు వెంకటయ్య, సురేశ్, ఈరపాగ రాముడు తదితరులు 25 మంది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో రాష్ట్రం సాధించిన విధంగానే దేశ సంక్షేమం కోసం అంతే పట్టుదలతో ఉన్నారని వెల్లడించారు.తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం దేశం ఎదురు చూస్తుందని, బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయని తెలిపారు.
అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని అన్ని రంగాలలో భ్రష్టుపట్టిస్తుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని అన్నారు.బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
బీమా చెక్కు అందజేత
ప్రమాదవశాత్తు మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త వనపర్తి పీర్ల గుట్ట కాలనీకి చెందిన కొమ్ము గోవిందు కుటుంబానికి బీమా నుంచి మంజూరైన రూ.2 లక్షల చెక్కును గోవిందు సతీమణి కొమ్ము లక్ష్మికి మంత్రి అందజేశారు.