వేల్పూర్ : తెలంగాణ పండిన వడ్లను కేంద్రం కొనను అంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ వేల్పూర్ మండల కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చబడితే వాళ్లు ఓర్వలేకపోతున్నారన్నారు.
వివిధ సందర్భాల్లో వరి వేయమని బిజెపి నాయకులు రైతులను రెచ్చగొట్టిన వీడియోలను మంత్రి వేముల నిరసన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రదర్శించి చూపించారు. సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందన్నారు. తెలంగాణ రైతులు ఆర్థికంగా బాగుపడాలని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. రెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనేందుకు ఆటంకాలు సృష్టిస్తోందన్నారు.
మమ్మల్ని వంద అన్న పడతాం మా తెలంగాణ సమాజాన్ని అంటే అస్సలు ఊరుకోమన్నారు. ఇక్కడి బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా ఢిల్లీ బీజేపీ సంకలో చేరి వారి మాటలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని,రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు.