హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తలాపునే గోదావరి, పాదాల చెంత కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా మడులు తడవవు.. జనాల దాహం తీరదు! సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జలగోస ఇది! ఇప్పటికీ అదే యాతన! వర్షాలు పడి నీళ్లొస్తే తప్ప, న్యాయమైన వాటాకు దిక్కేలేదు! ఉమ్మడి రాష్ట్రంలో తమ పార్టీయే దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నా.. తెలంగాణ ప్రాంత హక్కుల కోసం ఇక్కడి కాంగ్రెస్ నేతలు నోరు మెదిపింది లేదు! విభజన అనంతరం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు కేంద్రం సాయం పేరుతో ఉద్ధరించేస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్న బీజేపీ నాయకులు నదీజలాల సమస్యలపై దృష్టిసారించిందీ లేదు! పరిష్కారానికి చొరవ చూపిందీ లేదు. ఈ రెండు పార్టీల నిర్వాకం వల్ల.. తెలంగాణ నేటికీ తన న్యాయమైన నీటి హక్కులపై పోరాడాల్సిన పరిస్థితి దాపురించింది.
కాంగ్రెస్ది విద్రోహం..
వద్దంటున్నా హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రతో కలిపిన తర్వాత ఉమ్మడి ఏపీని దీర్ఘకాలం పాలించింది కాంగ్రెస్సే. ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేసి, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను పక్కన పడేయడంతో జరిగిన నష్టం అంతాఇంతా కాదు. ఆంధ్ర పొలాలకు నీళ్లు పారితే చాలనుకున్న అప్పటి సమైక్య ప్రభుత్వం.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా సీమాంధ్ర ప్రాంతానికి నదీ జలాలను ధారపోసింది. ఆ క్రమంలోనే పోతిరెడ్డిపాడు అక్రమంగా పురుడు పోసుకున్నది. ఫలితంగా పాలమూరు తన నీటి హక్కులను కోల్పోయి వలసల జిల్లాగా మారింది. నల్లగొండలో ఫ్లోరైడ్ భూతం వికటాట్టహాసాలు చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో రాష్ట్ర సాధన కోసం జనం ఉద్యమిస్తున్న వేళ సైతం తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు. అందుకు ఎన్నో నిదర్శనాలు.జలయజ్ఞంలో తెలంగాణకు భారీ నష్టాలను చేకూర్చే ప్రాజెక్టులను నాటి సీఎం వైఎస్ చేపడుతున్నా ఇక్కడి కాంగ్రెస్ నేతలు నోరెత్తలేదు.
టీఆర్ఎస్ మొక్కవోని జలసంకల్పం
తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం నాడు ఉద్యమనేతగా, నేడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ మొక్కవోని పోరాటం చేస్తున్నారు. నాడు పోతిరెడ్డిపాడు విస్తరణకు వ్యతిరేకంగా నినదించారు. పాదయాత్రలు చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తూ, మరోవైపు న్యాయమైన నీటివాటాను వినియోగించుకునేందుకు నూతన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడిరాష్ట్రంలో మొదలై దశాబ్దాలు గడిచినా పూర్తికాని కోయిల్సాగర్ , భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఉదయ సముద్రం, గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్ రెండో దశ, శ్రీరాంసాగర్ వరద కాలువ, ఎల్లంపల్లి, మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) ప్రాణహిత-దేవాదుల, కంతానపల్లి, అలీసాగర్, గుత్ప తదితర అనేక ప్రాజెక్టులను స్వల్పకాలంలో పూర్తిచేశారు. గోదావరి, కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మరికొన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేయడంతోపాటు వాటి పనులను పరుగులు పెట్టిస్తున్నారు.
బీజేపీ నిర్లక్ష్యం..