కాగజ్నగర్ రూరల్/బెజ్జూర్/పెంచికల్పేట్/సిర్పూర్(టి), జనవరి 9: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ డివిజన్లో రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బర్డ్వాక్ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. వంద మందికిపైగా వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు రెండు రోజులపాటు కాగజ్నగర్, బెజ్జూర్, పెంచికల్పేట సిర్పూర్(టి) రేంజ్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో కలియదిరిగారు. ఎన్నో అరుదైన జాతుల పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. కడంబా అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ రాములయ్య, అటవీ అధికారులు శాంతారాం, విజయ్ కుమార్ పర్యటించారు. బర్డ్ ఫెస్టివల్కు విశేష స్పందన వచ్చిందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రామలింగం తెలిపారు. ఆదివారం ఆయన సిర్పూర్(టి) మండలంలోని వెంపల్లిలోని టింబర్ డిపోలో బర్డ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాగజ్నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతాలు పక్షులకు ఆవాస కేంద్రాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఔత్సాహికులకు సర్టిఫికెట్తోపాటు టీ షర్ట్లను అందజేశారు.