హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): బీటెక్ విద్యార్థులకు బయోమెట్రిక్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అన్నిరకాల ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎంటెక్, ఎంఫార్మసీ విద్యార్థులతోపాటు బోధనా సిబ్బందికి బయోమెట్రిక్ విధానాన్ని జేఎన్టీయూ అధికారులు అమలు పరుస్తున్నారు. తాజాగా బీఈ/ బీటెక్ విద్యార్థులకూ ఈ తరహా అటెండెన్స్ తప్పనిసరి చేయబోతున్నారు. బీటెక్ స్థాయిలో బయోమెట్రిక్ను అమలు చేసే అంశంపై ఇప్పటికే వర్సిటీ వీసీ, రెక్టార్, రిజిస్ట్రార్తోపాటు ఆయా ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్ల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ను అమలు పరుచనున్నట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
ఈ మేరకు అవసరమైన సర్వర్ల కెపాసిటీని పెంచే అంశంపైనా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఔనన్నా, కాదన్నా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు పరుస్తామని స్పష్టంచేశారు. ప్రస్తుతం యూనివర్సిటీ, అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీలలో నాలుగు సంవత్సరాలు కలిపి మొత్తం 2.50 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వారందరి అటెండెన్స్ను బయోమెట్రిక్ ద్వారా స్వీకరించాలంటే సర్వర్ల కెపాసిటీ కూడా పెంచనున్నట్టు తెలిపారు. పూర్తిస్థాయిలో అటెండెన్స్ ఉంటే సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుందని చెప్పారు. దీనివల్ల నకిలీ అటెండెన్స్ విధానానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. బయోమెట్రిక్ అటెండెన్స్ అమలును అన్ని రకాల విద్యార్థి సంఘాలు కూడా స్వాగతిస్తున్నాయని వెల్లడించారు.