హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): జీవ ఇంధనాలను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి ఇక్రిశాట్ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇక్రిశాట్ తయారు చేసిన కొత్త వంగడం తీపి జొన్నలను ముడి సరుకుగా వినియోగించేందుకు సిద్ధమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్థిక ప్రోత్సాహంతో తీపి జొన్నలను బయో ఇంధన వనరుగా వాడి భారీ పరిమాణంలో బయో ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నది. 2022 నాటికి 10 శాతం, 2030 నాటికి 20 శాతం మేర ఇథనాల్తో కూడిన పెట్రోల్ వినియోగించాలనే లక్ష్యం మేరకు తీపి జొన్నలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఇక్రిశాట్ గుర్తించింది. నీటి ఎద్దడి ప్రాంతాల్లోనూ పండించేందుకు వీలు ఉండటం, ఉప ఉత్పత్తులుగా చక్కెర, పశుగ్రాసాన్ని తీపిజొన్నల నుంచి సేకరించే వీలు ఉండటం వంటి కారణాలతో చెరుకు పంటకు ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ తీపి జొన్నలను వీటిని అభివృద్ధి చేసింది.
తీపి జొన్నలో ఎన్నో అనుకూలతలు
ప్రస్తుతం ఉన్న చెరుకు పంట కంటే తీపి జొన్నలతో ఎన్నో అనుకూలతలు ఉన్నాయని ఇక్రిశాట్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లోనూ పండించొచ్చు. మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలోనే ఆరు మీటర్ల వరకు మొక్క వేగంగా పెరగడంతోపాటు, చెరుకు కంటే మూడింట ఒక్క వంతు నీటితోనే సాగు చేయవచ్చు. దిగుబడి పరంగా కూడా హెక్టారుకు ఒక టన్ను కంటే ఎక్కువ ధాన్యం, 50 టన్నుల కంటే ఎక్కువ కాండాలను ఇస్తుంది. ఒక టన్ను తీపి జొన్న కొమ్మ ద్వారా 50 లీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేయవచ్చు. హెక్టారులో పండిన తీపిజొన్నలతో 20 టన్నుల చక్కెర రసం ఉత్పత్తి అవుతుంది.
సహ ఉత్పత్తులు కూడా..
తీపి జొన్నల నుంచి ఇథనాల్ సేకరణలో భాగంగా ముందుగా కాండాలను చూర్ణం చేసి ఇథనాల్ కోసం ప్రాసెస్ చేస్తారు. ఇథనాల్ కోసం తీసిన రసం, ఆహారం కోసం పండించిన ధాన్యంతోపాటు బగాస్, కొమ్మ నుంచి తీసిన తర్వాత మిగిలిపోయిన వాటిని పశువుల మేతగా, ఇంధన ముడి సరుకుగా ఉపయోగించవచ్చు. ఇలా బహుళ ప్రయోజనాలు అందించే తీపిజొన్నలతో రైతులకు నిర్వహణ, సాగు ఖర్చు కూడా తగ్గుతుందని ఇక్రిశాట్ వర్గాలు వెల్లడించాయి.