BioAsia 2023 | కొన్నేండ్ల క్రితం వరకు ప్రతి బస్టాండ్, రైల్వే స్టేషన్లలో వెయింగ్ మెషీన్ను చూసే ఉంటారు. ఆ మెషీన్లో ఒక రూపాయి కాయిన్ వేస్తే.. మన బరువు ఎంతో తెలుసుకునే వాళ్లం. ఇప్పుడు అలాంటి ఓ అధునాతమైన మెషీన్ అందుబాటులోకి వచ్చింది. ఈ అధునాతన మెషీన్ ద్వారా బరువు ఒక్కటే కాదు.. ఇతర ఆరోగ్య వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెషీన్ బయో ఏషియా 2023 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ స్టాల్ను ప్రతి ఒక్కరూ సందర్శిస్తున్నారు. ఆరోగ్య వివరాలను క్షణాల్లో తెలుసుకునే ఈ మెషీన్ను హైదరాబాద్కు చెందిన పల్స్ యాక్టివ్ స్టేషన్స్ నెట్వర్క్ రూపొందించింది.
ఈ సందర్భంగా పల్స్ యాక్టివ్ స్టేషన్స్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు, సీఈవో జోగిందర్ తనికెళ్ల మాట్లాడుతూ.. మా ప్రొడక్ట్ పూర్తిగా నాన్ ఇన్వాసివ్. హెల్త్ చెకప్స్ చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని పూర్తిగా తెలంగాణలోనే తయారు చేశామని తెలిపారు.
ఇక ఈ మెషీన్లో మీ మొబైల్ నంబర్ను ఎంట్రీ చేసి.. ఒక్కసారి స్క్రీన్ ముందు నిలబడితే.. క్షణాల్లోనే మీ ఆరోగ్య వివరాలు వాట్సాప్కు వచ్చేస్తాయన్నారు. నివేదికలో బరువు, ఎత్తు, బీఎంఐ, బీపీతో పాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. మీ శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని కూడా నిర్ధారిస్తుంది. ఫిట్నెస్ లెవల్ను కూడా తెలుపుతుంది. ప్రస్తుతం ఈ పరికరం హైదరాబాద్లోని పలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉందన్నారు. త్వరలోనే ఆర్టీసీ బస్టాండ్లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జోగిందర్ తనికెళ్ల తెలిపారు.