హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ)ః కొవిడ్ సెకండ్వేవ్ కారణంగా దేశంలో బయోవ్యర్థాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రతిరోజు 74 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరిలో 53 టన్నులు, మార్చిలో 75 టన్నులు ఉత్పత్తి అయ్యింది. కానీ ఏప్రిల్, మే నెలలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానలు, క్వారంటైన్, ఐసొలేషన్ సెంటర్లు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఏప్రిల్లో ప్రతిరోజు సగటున సుమారు 139 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి కాగా, మే నెలలో ఏకంగా ప్రతిరోజు 203 టన్నులు ఉత్పత్తి అయినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తన నివేదికలో పేర్కొన్నది.
ఈ లెక్కన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో 4,170 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి కాగా.. మే నెలలో ఏకంగా 6,090 టన్నులు ఉత్పత్తి అయినట్టు సీపీసీబీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతిరోజు 4.96 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు వివరించింది. అలాగే అత్యధికంగా కేరళ రాష్ట్రంలో ప్రతిరోజు 23.71 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, ఆ తరువాతి స్థానంలో గుజరాత్ (21.98 టన్నులు) ఉన్నదని సీపీసీబీ ప్రకటించింది. అలాగే దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి ఎక్కువ ఉన్న రాష్ర్టాలను గమనిస్తే ఏపీలో 9.99 టన్నులు, ఢిల్లీలో 18.79 టన్నులు, హర్యానాలో 13.11 టన్నులు, కర్ణాటకలో 16.91 టన్నులు, మహారాష్ట్రలో 19.02 టన్నులు, తమిళనాడులో 13.57 టన్నులు, ఉత్తరప్రదేశ్లో 15.91 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని సీపీసీబీ తెలిపింది.
ప్రతిరోజు దవాఖానలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రయోగశాలలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, ఐసొలేషన్ సెంటర్ల ద్వారా ఉత్పత్తి అయిన బయోవ్యర్థాలను దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 198 కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ కేంద్రాలకు తరలించి అక్కడే డిస్పోజ్చేస్తున్నట్టు సీపీసీబీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 కామన్ బయోమెడికల్ ట్రీట్మెంట్ కేంద్రాలకు బయోవేస్ట్ను ఏ రోజుకు ఆ రోజు తరలించి ప్రజలకు ఎలాంటి హాని కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. బయోవ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా ఉండేందుకుగానూ వాహానాలను జీపీఎస్తో అనుసంధానం చేశారు. సీపీసీబీ ఇందుకు ప్రత్యేకంగా బయోవేస్ట్ ట్రాకింగ్ యాప్ను కూడా రూపొందించింది.