Pallavi Prashanth | బంజారాహిల్స్, డిసెంబర్ 20: బిగ్బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు మనోహర్ను బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామంలోని తన ఇంట్లో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. బిగ్బాస్ ఫైనల్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటికి రాగా, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో రన్నరప్గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రాగా, ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అనుదీప్ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. మరో పోటీదారు అశ్విని కారు అద్దాలను పగులగొట్టారు. రోడ్డుపై వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతోపాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని పగులగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ప్రశాంత్, ఏ2గా మనోహర్, ఏ3గా అతడి స్నేహిడుతు వినయ్ను చేర్చారు. ఇప్పటికే ఏ4గా ఉప్పల్కు చెందిన సాయికిరణ్, అంకిరావుపల్లి రాజును అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ప్రశాంత్, మనోహర్తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు.