బంజారాహిల్స్/నాంపల్లి కోర్టులు, డిసెంబర్ 21: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద చెలరేగిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు బిగ్బాస్ విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ (26), అతడి సోదరుడు పరశురామ్ అలియాస్ మహావీర్ (24)కు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
జూబ్లీహిల్స్ పోలీసులు వీరిని అరెస్టుచేసి గురువారం తెల్లవారుజామున వైద్య పరీక్షల ఆనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. విధ్వంసం ఘటనలో ప్రశాంత్తోపాటు అతడి సోదరుడి ప్రమేయంపై వీడియోలను, ఇతర సాక్ష్యాలను పోలీసులు సమర్పించడంతోపాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తీరుపై రిమాండ్ రిపోర్ట్ను న్యాయయూర్తికి సమర్పించారు. ఏ-1 ప్రశాంత్, ఏ-2 పరశురామ్కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిద్దరినీ గురువారం ఉదయం పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
మరో 12 మంది అరెస్టు.. విడుదల
బిగ్బాస్ ఫైనల్స్ రోజున అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు బిగ్బాస్ షో నుంచి బయటకు వస్తున్న పోటీదారులు, యాంకర్ల కార్లను ధ్వంసం చేసిన కేసులో 12 మంది నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరంతా స్టూడియో రహదారి వద్ద బీభత్సం సృష్టించినట్టు సీసీ ఫుటేజీలతోపాటు సోషల్మీడియా వీడియోల ద్వారా పోలీసులు గుర్తించారు. మూడురోజులపాటు వివిధ మార్గాల ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు.
అరెస్టయినవారిలో ఇందిరానగర్కు చెందిన భూపతి బాలకృష్ణ (28) జీ మోహన్కుమార్(28), రంజిత్కుమార్ (22) భూపతి రాఘవేందర్ (25), మాలవల గణేశ్ (21), ధర్మపురి రోహిత్ (24), సరళా రాఘవ (23), పీ సురేందర్ (20), ఆర్ నవీన్ (19), ఏ సంతోష్(18), ధర్మపురి యేసురత్నం (20), ఇడుమల్ల మహేశ్ (19) ఉన్నారు. వీరిని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట గురువారం పోలీసులు హాజరుపర్చగా.. మెజిస్ట్రేట్ సాయిసుధ రిమాండ్ను తిరస్కరిస్తూ సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఘటనలో నేరుగా ప్రమేయం ఉన్న మరో నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చారు.
ప్రశాంత్ బెయిల్పై వాదనలు పూర్తి
ప్రశాంత్తోపాటు సోదరుడి తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్పై గురువారం వాదనలు పూర్తయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అమర్దీప్, ప్రశాంత్ అనుచరుల మధ్య జరిగిన వాగ్వివాదం దాడులకు దారితీసినట్టు పోలీసులు తెలిపారు. ప్రశాంత్ కారు డ్రైవర్ నిందితుడిగా ఉన్నందున ప్రశాంత్తోపాటు సోదరుడికి బెయిల్ మంజూరు చేయవద్దని, విధ్వంసానికి వీరిద్దరూ ప్రోత్సహించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. విజేతగా ప్రకటించిన అనంతరం నిందితుడు ప్రశాంత్ కారులోనే ఉన్నాడని, ఎలాంటి గొడవలకు ప్రేరేపించలేదని వారి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఐదేండ్ల శిక్షకు లోబడి ఉన్న సెక్షన్ల కింద 41-ఏ నోటీసులు జారీ చేయకుండా వారిని అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.