హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రిటైల్ మొబైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన బిగ్సీ మరో మైలురాయికి చేరుకున్నది. తాజాగా సంస్థ 21వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2002లో విజయవాడలో తొలి స్టోర్ను ఆరంభించిన ఆ సంస్థ.. తన వ్యాపారాన్ని 250కి పైగా స్టోర్లను విస్తరించి దక్షిణాదిలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ.. కస్టమర్లు తమపై పెట్టుకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని, కొనుగోలుదారుల అవసరాలు తీర్చడం వల్లనే అగ్రస్థానంలో నిలిచామని చెప్పారు. వచ్చే రెండేండ్లలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో కొత్తగా 150 రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
ఒక్కో స్టోర్కు రూ.1-2 కోట్ల చొప్పున రూ.300 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. మొత్తం అవుట్లెట్ల సంఖ్య 250 నుంచి 400కి చేరుకోనున్నదని వెల్లడించారు. ప్రస్తుతం సంస్థలో 2,500 మంది పనిచేస్తుండగా, సిబ్బంది సంఖ్య నాలుగు వేలకు చేరుకుంటుందని వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లుగా నమోదైన టర్నోవర్.. ఈ ఏడాది రూ.1,500 కోట్లకు చేరుకుంటుందని వెల్లడించారు. కొత్త స్టోర్లలో మొబైళ్లతోపాటు స్మార్ట్టీవీ, ఏసీలు, ల్యాప్టాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.