హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్కు రావడానికి నిరాకరించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన మాణిక్ ఠాక్రే తొలిసారిగా నేడు హైదరాబాద్కు వచ్చారు. పార్టీ నేతలతో ఒక్కొక్కరిగా సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి ఆయన ఫోన్ చేశారు. గాంధీ భవన్కు రావాలని, సమస్యలపై చర్చించుకుందామని ఆహ్వానించారు.
అయితే ఎంపీ కోమటిరెడ్డి దానికి తిరస్కరించారు. తాను గాంధీ భవన్కు రాలేనని చెప్పారు. బయట కలుస్తానని ఠాక్రేకు ఫోన్లో తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక సమయం నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీతో కూడా ఆయన భేటీ అయ్యారు. దీంతో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఆయన కూడా పయణించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈనేపథ్యంలో ఆయనను మాణిక్ ఠాక్రే పిలవడం హాట్టాపిక్గా మారింది.