సనత్నగర్లో నివసిస్తున్న వీఆర్ చౌదరి కుటుంబం
రామచంద్రాపురం, సెప్టెంబర్ 22: భారత వైమానిక దళాధిపతిగా వివేక్ ఆర్ చౌదరిని భారత రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ (భెల్)లోని హయ్యర్ సెకండరీ స్కూల్లో వీఆర్ చౌదరి చదువుకొన్నారు. నాటి హైదరాబాద్ స్టేట్కు చెందిన వీఆర్ చౌదరి కుటుంబం దశాబ్దాల క్రితమే హైదరాబాద్కు వచ్చి స్థిరపడింది. చౌదరి తండ్రి ఆర్జీ చౌదరి భెల్ ట్రైనింగ్ స్కూల్లో సీనియర్ ఇన్స్ట్రక్టర్గా, తల్లి సుహాన్చౌదరి హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం వీఆర్ చౌదరి ఎయిర్ ఫోర్స్లో ఎయిర్స్టాఫ్ వైస్ చీఫ్గా పనిచేశారు. ప్రసుత్త ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ బదౌరియా ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో వీఆర్ చౌదరిని ఆయన స్థానంలో నియమిస్తున్నట్టు రక్షణశాఖ ప్రకటించింది. భెల్ పూర్వవిద్యార్థి వీఆర్ చౌదరి భారత వైమానిక దళాధిపతిగా నియమితులవ్వడం రాష్ర్టానికే గర్వకారణం. ప్రసుత్తం వీఆర్ చౌదరి కుటుంబసభ్యులు హైదరాబాద్లోని సనత్నగర్ జెక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. టీపీపీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, వీఆర్ చౌదరి ఇద్దరు భైల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో కలిసి చదువుకున్నారు. 1982లో వీఆర్ చౌదరి ఇండియన్ ఎయిర్ఫోర్సులో చేరారు. చౌదరికి మిగ్-21, 23, 29, సు-30, ఎంకేఐ ఫైటర్ జెట్లు నడిపిన అనుభవం ఉన్నది. వివిధ విమానాల్లో 3,800 గంటలపైగా ఆకాశంలో ప్రయాణించిన అనుభవం ఉన్నది. చౌదరి ఫ్రంట్లైన్ ఫైటర్ స్వాడ్రన్ కమాడింగ్ ఆఫీసర్గా ఫ్రంట్లైన్ ఫైటర్ బేస్కు ప్రాతినిధ్యం వహించారు. భారత ప్రభుత్వం చౌదరిని పరమ విశిష్ట సేవా పతకం (పీవీఎస్ఎం), అతి విశిష్ట సేవా పతకం (ఏవీఎస్ఎం), వాయుసేన పతకాల (వీఎం) తో సన్మానించింది.