హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోషణమాసోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో కొన్ని యూనియన్లు సమ్మె చేయటం సరికాదని ఒక ప్రకటనలో తెలిపారు.
అంగన్వాడీల పట్ల సీఎం కేసీఆర్ చూపించిన ఉదారతకు ఆకర్షితులమై ఏడేండ్లుగా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా బీఆర్టీయూ ట్రేడ్ యూనియన్ను స్థాపించి అంగన్వాడీలను ఐక్యానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం 30% పీఆర్సీ వర్తింపజేసిన విషయాన్ని మరవద్దని కోరారు. అంగన్వాడీల సమస్యల పరిషారం కోసం మంత్రి సత్యవతి రాథోడ్ గత నెల 18న అన్ని యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేశారు.