మొన్న సాహితీ ఇన్ఫ్రా.. నిన్న వాసవి బిల్డాక్స్.. తాజాగా భారతి బిల్డర్స్.. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే సామాన్యుడి బలహీనతను ఆసరాగా చేసుకొని ఆడుకుంటున్న రియల్ ఎస్టేట్ సంస్థలివి. ఆకర్షణీయమైన బ్రోచర్లు, గ్రాఫిక్ డిజైన్లతో అందమైన భవంతులు, అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తామంటూ కల్లబొల్లి కబుర్లు.. అంతకుమించి భారీ కమీషన్లతో ఏజెంట్ల నియామకం.. ఇంకేముంది! గాలిలో మేడలు కట్టి అందినంత డిపాజిట్ల రూపంలో దండుకోవడమే పనిగా మారింది. ఇలా హైదరాబాద్ నగరంలో తాజాగా మరో భారీ రియల్ మోసం వెలుగుచూసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): ఒకటీ.. అరా కాదు! ఏకంగా జనం నుంచి రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్ బోర్డు తిప్పేసింది. ప్రకటించిన ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించకపోవడం ఒక వంతైతే, అందుకు కేటాయించిన భూమిని మరో పార్టీకి విక్రయించి ఆ మొత్తాన్ని కూడా దండుకున్నారు. మూడేండ్లపాటు ఆశగా ఎదురుచూసిన బాధితులు ఇక ఓపిక నశించి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ జరిపిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఎట్టకేలకు శనివారం భారతి బిల్డర్స్ చైర్మన్ దూపటి నాగరాజు, మేనేజింగ్ డైరెక్టర్ మల్పురి శివరామకృష్ణ, సీఈవో తొడ్డాకుల నర్సింహారావును అరెస్టు చేశారు.
ఆర్థిక నేరాల విభాగం డీసీపీ కే ప్రసాద్ కథనం ప్రకారం.. దూపటి నాగరాజు, ముల్పురి శివరామకృష్ణతో కలిసి 2021లో ‘భారతి బిల్డర్స్’ పేరుతో భవన నిర్మాణ సంస్థను స్థాపించారు. మాదాపూర్లో ప్రధాన కార్యాలయాన్ని తెరిచారు. మేడ్చల్లోని కొంపల్లిలో 6.23 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు ఫ్లాట్లను నిర్మించి విక్రయించేందుకు నిర్ణయించారు. చదరపు అడుగు రూ.3,200 చొప్పున రేటు నిర్ధారించి ఆకర్షణీయమైన బ్రోచర్లను ముద్రించారు. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించడంతోపాటు మాదాపూర్లోని ప్రధాన కార్యాలయంలో కొనుగోలుదారులకు తరచూ సమావేశాలు నిర్వహించి… మాటలతో బురిడీ కొట్టించారు. పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించేందుకుగాను మాదాపూర్కు చెందిన తొడ్డాకుల నర్సింహారావు అలియాస్ పొన్నారిని సీఈవోగా నియమించారు. కమీషన్ల ఆశ చూపి ఏజెంట్లను కూడా నియమించుకున్నట్టు తెలిసింది. ఇలా ఏకంగా 350 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేశారు. ముఖ్యంగా కొంపల్లి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి డిమాండు బాగా ఉండటంతో వినియోగదారులు కూడా ఎంతో ఆశతో లక్షల రూపాయలు సమర్పించుకున్నారు.
ఒకవైపు 350 మంది నుంచి రూ.60 కోట్ల డిపాజిట్లు సేకరించిన భారతి లేక్వ్యూ నిర్వాహకులు మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా అదే భూమిని ఇతరులకు విక్రయించారు. రెసిడెన్షియల్ అపార్టుమెంట్లను నిర్మిస్తామని ప్రకటించిన కొంపల్లిలోని 6.23 ఎకరాలను మరోపార్టీకి రూ.100 కోట్లకు విక్రయించారు. ఇదే భూమిపై బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారనే ప్రచారం ఉన్నది. కొనుగోలుదారుల నుంచి డిపాజిట్లు సేకరించిన నిర్వాహకులు మూడేండ్లయినా ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో బాధితులు ఒత్తిడి చేయసాగారు. నిర్మాణ పనులు మొదలుపెట్టకపోగా బాధితులు ఎంతగా ఒత్తిడి చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన బీవీఎస్ ప్రసాద్రావు అనే బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బట్టబయలైంది. చివరకు శనివారం భారతి బిల్డర్స్ చైర్మన్ దూపటి నాగరాజు, మేనేజింగ్ డైరెక్టర్ మల్పురి శివరామకృష్ణ, సీఈవో తొడ్డాకుల నర్సింహారావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును డీసీపీ ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జే వెంకటేశ్వర్లు, శ్రీను దర్యాప్తు చేస్తున్నారు.
కొన్ని రియల్ సంస్థలు ఆకర్షణీయమైన ప్రకటనలతో చేసే ప్రీలాంచ్ ఆఫర్లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ప్రజలకు సూచించారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే డబ్బులు జమ చేయాలని, ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. డిపాజిట్లు సేకరించి, మోసం చేసిన భారతి బిల్డర్స్ నిర్వాహకులకు చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.