Bharat Jagruthi | తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న భారత జాగృతి సంస్థ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించింది. తెలంగాణ అస్థిత్వాన్ని సమున్నతంగా నిలిపే దిశగా భారత జాగృతి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో అనేక ప్రచురణలు వెలికి తెచ్చింది. తెలుగు సాహితీ రంగ విస్తృతికి తోడ్పడాలనే ఉన్నతాశయంతో తెలుగు సాహితీ పక్ష పత్రిక “తంగేడు”ను ప్రచురిస్తున్న విషయం కూడా సాహితి అభిమానులకు తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాలకు సాహితీ సింగిడిని అద్దనుంది భారత జాగృతి.
ఈ క్రమంలో భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయం మేరకు హైదరాబాద్లో రెండు రోజులపాటు సాహితీ సభలను నిర్వహిస్తుంది భారత జాగృతి. జూన్ 12, 13 తేదీల్లో హైదరాబాద్లోని సారస్వత పరిషత్తు ప్రాంగణంలో జరగనున్న ఈ సాహిత్య సభలలో తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలపై రెండు రోజుల పాటు లోతైన సమాలోచనలు, పత్ర సమర్పణలు ఉంటాయి. జూన్ 12 ఉదయం “స్వరాష్ట్రంలో సాహితీ వికాసం” పేరుతో జరిగే ప్రారంభ సామావేశంతో తెలంగాణ సాహిత్య సభలు మొదలవుతాయి. ఆరు సెషన్లలో అంశాలవారీగా జరిగే ఈ సభలలో వివిధ రంగాలపై సాధికార అవగాహన కలిగిన, అధ్యయనం, పరిశోధన చేసిన సాహితీ మూర్తుల ప్రసంగాలు ఉంటాయి. 13వ తేదీ సాయంత్రం ముగింపు సమావేశంతో సాహిత్య సభలు ముగుస్తాయి.
ఈ సాహితీ సభలలో భాగంగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసే రచనలు చేసిన ఒక సాహితీ మూర్తికి ప్రొఫెసర్ జయశంకర్ సాహిత్య జాగృతి పురస్కారం అందజేయనుంది భారత జాగృతి. విస్తృత రచనలు, వివిధ ప్రక్రియలు, లోతైన అధ్యయనం, జన హితం ప్రాతిపదికలుగా ప్రతి సంవత్సరం ఒకరిని ఎంపిక చేసి ఈ అవార్డును ఇవ్వనున్నట్టు సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.