కేసీఆర్ లాంటి నాయకుడిని ఇప్పటివరకు చూడలేదు. కాలంతో పోటీపడుతూ పనిచేస్తున్న తెలంగాణ లాంటి ప్రభుత్వాన్ని కూడా చూడలే. కేసీఆర్ ఈజ్ ఏ విజనరీ లీడర్. ఎక్కడయినా సరే నీటి వనరులే అభివృద్ధికి ప్రధాన కారణం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఆ నీటి వనరుల లేకనే తెలంగాణ ఒకనాడు తల్లడిల్లింది. ఇప్పుడు ఆ నీటి వనరులను ఒడిసిపట్టడం వల్లే ప్రగతి పథంలో దూసుకుపోతున్నది.
-భానుదాస్ ముర్కుటే
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ‘ఆకాశం నుంచి భూమిపైకి ఆ భగీరథుడు గంగమ్మను తీసుకొచ్చాడు. అదొక ఇతిహాసం.. పురాణాల్లో చదివిందే తప్ప ఎవరూ చూసింది లేదు. నేనూ ఎప్పుడూ పల్లానికి పరుగులు తీసిన గోదావరినే చూశాను. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా గోదావరి పల్లం నుంచి ఎగువకు ఎదురెక్కడం చూస్తున్నా. అది కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం. దాని రూపశిల్పి తెలంగాణ సీఎం కేసీఆర్ అపర భగీరథుడే. ఆ నీటి వల్లే అన్ని రంగాల్లో నేడు తెలంగాణ పరివర్తన చెందుతున్నది. ప్రగతి పథంలో దూసుకుపోతున్నది’ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు మహారాష్ట్రకు చెందిన పారిశ్రామికవేత్త, సీనియర్ రాజకీయనేత భానుదాస్ ముర్కుటే. మహారాష్ట్ర రాజకీయాలతోపాటు పారిశ్రామికరంగంలో కూడా భానుదాస్ ముర్కుటేకు సుదీర్ఘ అనుభవం ఉన్నది. ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తారని ఆయనకు పేరున్నది. చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేసిన ఆయనకు, అనేక అంశాలపై లోతైన అవగాహన ఉన్నది. ముర్కుటే 1972-80 వరకు న్యూ ఆర్ట్స్ కామర్స్ కాలేజీ, పద్మశ్రీ విఠల్రావు వీకే పాటిల్ కాలేజీ, లా కాలేజీల్లో ప్రొఫెసర్గా పనిచేశారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా శ్రీరాంపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా 1985-90, 1990-95, 1995-99 వరకు మూడుసార్లు సేవలందించారు. ప్రస్తుతం అశోక్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, అహ్మద్నగర్ జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్గా, అశోక్ చక్కెర కార్ఖానా లిమిటెడ్ చైర్మన్గా ముర్కుటే ఉన్నారు. ఆలిండియా డిస్టిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిండెంట్గా కూడా 2010-2012లో పనిచేశారు. తెలంగాణలో అభివృద్ధిని స్వయంగా పరిశీలించేందుకు ఆయన రెండు రోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో తన అనుభవాలను పంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కూడా వినూత్న పంథాను అనుసరిస్తున్నది. విప్లవాత్మక పథకాలతో, సాహసోపేత నిర్ణయాలతో సీఎం కేసీఆర్ సారథ్యంలో దూసుకుపోతున్నది. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. ఇటీవల కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో తన పార్టీ ఏర్పాటు చేయడంతోపాటు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలంగాణ పథకాలు, ప్రాజెక్టులు, సాధిస్తున్న ప్రగతిని ఎంతో గొప్పగా చెప్పారు. 2014లో గుజరాత్ మాడల్ అంటూ నేటి ప్రధాని మోదీ ఊదరగొట్టారు. తెలంగాణ మాడల్ కూడా అలాంటిందేమోనని అభిప్రాయం మొదట్లో ఉండేది. అందుకే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించుకున్నా. ఆ ఉద్దేశంతోనే ఇక్కడి వచ్చాం. రెండు రోజులు వివిధ చోట్ల పర్యటించాం.
అదొక ప్రపంచ అద్భుతం. ఆకాశం నుంచి భూమిపైకి ఆ భగీరథుడు గంగమ్మను తీసుకొచ్చాడని ఇతిహాసాల్లో చదివాం. ఎవరూ అది చూసింది లేదు. నేనూ ఎప్పుడూ పల్లానికి పరుగులు తీసిన గోదావరినే చూశాను. కానీ జీవితంలో మొదటిసారి పల్లం నుంచి ఎత్తుకు ఎదురెక్కుతున్న గోదావరిని తెలంగాణలోనే చూశా. అది కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం. ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ అపర భగీరథుడే. అంతేకాదు మహారాష్ట్రలో గోదావరిలో ఎక్కడా నీళ్లు లేవు. కానీ ఇక్కడ సుమారు 200 కిలోమీటర్ల మేర గోదావరి నిండుగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ మోటర్లు, వందల కిలోమీటర్ల సొరంగాలు, కాలువలు, బరాజ్లు, రిజర్వాయర్లు అదో సాంకేతిక అద్భుతం. గోదావరినే రిజర్వాయర్గా మార్చిన ఘనత తెలంగాణకే సొంతం. అంతటి భారీ ప్రాజెక్టును కేవలం 3 ఏండ్లలోనే పూర్తి చేయడం మరింత విస్మయానికి గురిచేసింది. దీక్షా, సంకల్పబలం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. కేసీఆర్ విజన్కు, ప్రగతి దీక్షకు కాళేశ్వరమే నిలువెత్తు నిదర్శనం.
గజ్వేల్లోని మిషన్ భగీరథ ప్లాంట్ను సందర్శించాం. అక్కడ నీటిని స్వయంగా తాగి చూశాం. దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం చేయని, అసాధ్యం అనుకున్న దానిని కేసీఆర్ సాధ్యం చేసి చూపారు. నా పర్యటనలో దారిపొడవునా తెలంగాణ పల్లెలను కూడా పరిశీలించా. ఎక్కడా పడావుపడి ఉన్న భూమి కనిపించలేదు. పల్లెలు కూడా పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఆహ్లాదకర వాతావరణమే. మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఈ పర్యటన. ఉత్సాహాన్ని నింపింది.
మీరన్నది నిజమే. గోదావరి పొడవునా మహారాష్ట్ర సర్కారు కూడా డ్యామ్లను, పదుల సంఖ్యలో కేటీ వియర్లను నిర్మించింది. జయక్వాడ్, గంగాపూర్, మూల చెప్పుకోదగినవి. వందల సంఖ్యలో చెక్డ్యామ్లు కూడా ఉన్నాయి. కానీ ఏం లాభం.. ఒక విధానం, ప్రణాళిక లేకుండా పోయింది. నీరుండేది ఒక చోట ప్రాజెక్టులను కట్టింది మరొక చోట. ఇక ఫలితాలు ఎలా వస్తాయి? కొత్త ప్రాజెక్టులు ఏమైనా కడతారా అంటే అదీ లేదు. ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంవత్సరాలు గడచిపోతున్నాయి. ఇదీ పరిస్థితి. 30 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పదు సంఖ్యలో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పరిశ్రమలకు అనుమతులు సాధించడమంటేనే ఒక ప్రహసనం. ఇంకా అటు తరువాత ఏమైనా సజావుగా ఉంటుందా అంటే అదీ లేదు. కరెంటు ఉంటే నీళ్లు ఉండవు. నీళ్లు ఉంటే కరెంటు ఉండదు. పారిశ్రామిక ప్రగతిలో ఒకనాడు పురోగమించిన మహారాష్ట్ర ఇప్పుడు తిరోగమనం వైపు నడుస్తున్నది. పరిశ్రమలు మూత పడుతున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. ఆయన గొప్ప నాయకత్వ పటిమ కలిగిన నేత. రాష్ర్టాన్ని సాధించడమేగాకుండా, తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షాలను నెరవేర్చుతున్న ధీరోదాత్తుడు. ప్రస్తుతం దేశంలో బీజేపీని ఢీకొట్టగలిగే నాయకుడు కేసీఆర్ ఒక్కరే. గొప్ప వాగ్ధాటి, చరిష్మా ఉన్న నాయకుడు. దేశ ప్రజానీకాన్ని కదలించగల సత్తా ఆయనకు ఉన్నది. గొప్ప పరిపాలన దక్షత కలిగినవాడు. తెలంగాణను తీర్చిదిద్దిన విధానమే అందుకు నిదర్శనం. ఇంట్లో మనిషిలా ఉంటూ సామాన్యుల భాషలో మాట్లాడటమేకాకుండా వారి సమస్యల పరిష్కారం కోసం మడమ తిప్పకుండా పోరాడగల జననాయకుడు. ప్రజాసంబంధాలను కొనసాగించడంలో ఆయనకు ఆయనే సాటి. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడటమేగాకుండా, ఎప్పుడు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసిన పరిపూర్ణ నాయకుడు. ఆయన ఏదీ నోటి మాటగా చెప్పరు. నిర్ధిష్టంగా, గణాంకాలతో పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే అవగాహనతో మాట్లాడతారు. ఆ లక్షణాల వల్లే కేసీఆర్ మాస్ లీడర్గా ఎదిగారు.
కేసీఆర్ లాంటి నాయకుడిని ఇప్పటివరకు చూడలేదు. కాలంతో పోటీపడుతూ పనిచేస్తున్న తెలంగాణ లాంటి ప్రభుత్వాన్ని కూడా చూడలే. కేసీఆర్ ఈజ్ ఏ విజనరీ లీడర్. ఎక్కడయినా సరే నీటి వనరులే అభివృద్ధికి ప్రధాన కారణం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఆ నీటి వనరుల లేకనే తెలంగాణ ఒకనాడు తల్లడిల్లింది. ఇప్పుడు ఆ నీటి వనరులను ఒడిసిపట్టడం వల్లే ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. నేటి తెలంగాణ పరివర్తనకు జలవనరులే కారణం. ఆ సత్యాన్ని గ్రహించడమే కాదు ఆచరణలో పెడుతున్న దీక్షాపరుడు కేసీఆర్.
చర్చ జరుగుతుండటం వల్లే కదా ఇక్కడి వరకు వచ్చింది. మహారాష్ట్రను దశాబ్దాలుగా ఏలుతున్న పార్టీలు అభివృద్ధికన్నా కుమ్ములాటల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నాయి. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలే అందుకు ఉదాహరణ. మహారాష్ట్రీయులు విసుగెత్తిపోయి ఉన్నారు. మరోవైపు సరిహద్దుకు ఇవతల తెలంగాణ సాధిస్తున్న ప్రగతి కండ్లముందే కనబడుతున్నది. ప్రజలను ఎవరూ ఏమార్చలేరు కదా! ఇప్పుడు మహారాష్ట్రలో అదే చర్చ కొనసాగుతున్నది. కేసీఆర్ పేరు బాగా వినబడుతున్నది. గ్రామగ్రామానా మార్మోగిపోతున్నది.