కరకగూడెం, నవంబర్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. కొవిడ్ వేళ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సర్పంచ్, సిబ్బంది ప్రజలకు విశేష సేవలందించారు. ఈ సేవలకు గాను ఎన్ఐఆర్డీపీఆర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్) బెస్ట్ కొవిడ్ కంట్రోల్ పంచాయతీగా కన్నాయిగూడెం గ్రామాన్ని ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా ఆరు పంచాయతీలు.. రాజస్థాన్-1, అస్సాం-2, మణిపూర్-1, ఉత్తరాఖండ్-1, తెలంగాణ రాష్ట్రం నుంచి కన్నాయిగూడెం పంచాయతీ ఎంపికైంది. ఈ నెల 23 నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో నిర్వహించే సంస్థ వ్యవస్థాపక ఉత్సవాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లకు పురస్కారాలను అందించనున్నారు.