BFHI Recognition | ఖమ్మం జిల్లా దవాఖానకు ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్’ గుర్తింపు దక్కింది. ముర్రుపాలు అందించడం, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు ‘బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్’ (బీఎఫ్హెచ్ఐ)లో భాగంగా ఈ సర్టిఫికెట్ అందజేయనున్నారు. ఖమ్మంతో కలిపి రాష్ట్రంలో ఆరు దవాఖానలకు మాత్రమే బీఎఫ్హెచ్ గుర్తింపు పొందాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాన్సువాడలోని ఎంసీహెచ్ మొదటి బీఎఫ్హెచ్ఐ సర్టిఫికెట్ సాధించింది.
ఆ తర్వాత జనగాం ఎంసీహెచ్, గజ్వెల్ ఏరియా హస్పిటల్, సూర్యాపేట ఎంసీహెచ్, జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ ఈ గుర్తింపు పొందాయి. తద్వారా దేశంలోనే అత్యధిక బీఎఫ్హెచ్ఐ అక్రిడేటెడ్ ప్రభుత్వ దవాఖానలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయనడానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది. బిడ్డపుట్టిన అరగంటలోనే మ్రురుపాలు తాగించాలని, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మ్రాతమే తాగించాలని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
తద్వారా ఐదేండ్లలోపు పిల్లల మరణాలను 22శాతం నివారించవచ్చని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తల్లిపాల వినియోగం, శిశు మరణాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఓ వైపు ఎంసీహెచ్లు, ఎన్ఐసీయూలు వంటి సదుపాయాలు కల్పించింది. మరోవైపు ‘బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా’ (బీపీఎన్ఐ) సహకారంతో 30 మంది మాస్టర్ ట్రెయినీలకు శిక్షణ ఇప్పించింది. ఇలా శిక్షణ ఇప్పించిన తొలిరాష్ట్రంగా రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలకు శిక్షణ ఇస్తున్నారు. వారంతా గర్భిణులకు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.