నిజామాబాద్ క్రైం, మే 25: స్థానికత జీవోతో తెలంగాణ యువతకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. స్వరాష్ట్రం సాధించడం ఎంత గొప్పదో.. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసి 317 జీవోను అమలు చేయడం అంతే గొప్పదని పేర్కొన్నారు.
పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న యువతకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్శాఖ ద్వారా ఉచిత కోచింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు.మంత్రి సొంత ఖర్చుతో రూపొందించిన స్టడీ మెటీరియల్ను అభ్యర్థులకు బుధవారం పంపిణీచేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్థానిక కోటాలోని ఉద్యోగాలతోనే సరిపెట్టుకోకుండా జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాలను సైతం నూరు శాతం జిల్లా అభ్యర్థులే కైవసం చేసుకోవాలని సూచించారు. సరైన ప్రణాళికతో చదివితే ఉద్యోగ సాధన సులువేనన్నారు. శిక్షణ కేంద్రాలను నిర్వహించడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టంచేశారు.