Aasara Pension | నారాయణపేట, ఫిబ్రవరి 2 : జనవరి నెల ఆసరా పింఛన్లు అందక లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఈ ఘటన శుక్రవారం నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం, పోస్టాఫీస్లో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పింఛన్లు అందకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు.
స్థానిక గ్రామ పంచాయతీ భవనం ఎదుట మహబూబ్నగర్-హైదరాబాద్-యాద్గీర్ ప్రధాన రహదారిపై పింఛన్దారులు బైఠాయించారు. దీంతో గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని సంబంధిత పోస్టల్ అధికారులకు సమాచారం అందించారు. పింఛన్లు అందిస్తామని పోస్టల్ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నారాయణపేట ఎంపీడీవో వెంకయ్య సైతం గ్రామానికి చేరుకుని కారణాలను తెలుసుకున్నారు.