తెలంగాణ మహిళలు తమకు ఎక్కడ వేధింపులు ఎదురైనా ధైర్యంగా ఫిర్యాదు చేస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందన్నారు. హైదరాబాద్లో సోమవారం ట్రూ కాలర్, నెట్వర్క్-18 ఆధ్వర్యంలో సామాజిక మాధ్యమాల్లో మహిళలు- వేధింపులపై గళమెత్తడం అనే అంశంపై జరిగిన జాతీయస్థాయి అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఈ కార్యక్రమం మోడరేటర్గా ప్రముఖ జర్నలిస్ట్ , సీనియర్ పొలిటికల్ ఎడిటర్ మార్యా షకీల్ వ్యవహరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఇంటర్నెట్ మరింత అందుబాటులోకి వస్తే మహిళలకు ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి కోసం బీడీలు చుడుతున్న మహిళలు, ల్యాప్టాప్ల్లో పనిచేసే రోజులు రావాలన్నారు.
సోషల్ మీడియాలో ఎదురయ్యే వేధింపులకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే పోలీసులు తక్షణం చర్య తీసుకునే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేయొద్దన్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు.
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో షీ టీంలు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. వీటితోపాటు మహిళా పోలీసు స్టేషన్లు, స్పెషల్ సైబర్ సెల్ సైతం ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మహిళలపై సైబర్ వేధింపులకు ప్రత్యేక చట్టాలు ఉంటే, మరింత వేగంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.
రక్షణతోపాటు మహిళల ఆర్థిక స్వావలంభన కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసరా, డబుల్బెడ్రూమ్ ఇండ్ల వంటి పలు పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మహిళల పేరుపైనే ఆసరా, డబుల్బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తున్నారన్నారు. ఇటీవల రాష్ట్రంలో జూనియర్ లైన్మెన్గా మహిళ నియమితులు కావడం గుర్తు చేశారు.