హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం అన్నిరంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నందున గ్రామీణ సహకార సంస్థలు కూడా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. ప్రభుత్వ సహకార సమాఖ్య సంస్థల ఆర్థిక పరిపుష్టి పర్యవేక్షణపై ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం గురువారం సీఎస్ అధ్యక్షతన బీఆర్కే భవన్లో జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకుల పనితీరును సమీక్షించారు.
తెలంగాణ కేంద్ర వ్యవసాయ సహకార బ్యాంకు లావాదేవీలు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 22.8శాతం అధికంగా ఉన్నాయని చెప్పారు. షేర్ క్యాపిటల్లో 25.41శాతం, నిల్వలు 10.6 శాతం, డిపాజిట్లు 26.99 శాతం వృద్ధి సాధించిందన్నారు. 6261.80 కోట్ల రుణా లు, పెట్టుబడులు రూ.2058.52 కోట్ల కు చేరాయన్నారు. టీఎస్సీఏబీ నిర్వహణ లాభం మార్చి చివరినాటికి రూ.100.89 కోట్లు, నికరలాభం రూ.77.29 కోట్లు వచ్చినట్లు చెప్పారు. ప్యాక్స్ కంప్యూటరీకరణలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచినట్టు సీఎస్ వివరించారు. సమావేశంలో టీఎస్సీఏబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీదేవి, సహకారశాఖ కమిషనర్ వీరభద్రయ్య, టీఎస్సీఏబీ ఎండీ మురళీధర్ పాల్గొన్నారు.