హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలకు బడ్జెట్లో కేంద్రం రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. శుక్రవారం కాచిగూడలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ నాయకుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమని బడ్జెట్లో తేటతెల్లమైందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం గత 75 ఏండ్లుగా బీసీలను బిచ్చగాళ్లుగా చూస్తుందని, బీసీలంటే బిచ్చగాళ్లు కాదని.. వాటాదారులని పేర్కొన్నారు. త్వరలో బీసీల సత్తా ఎంటో మోదీ ప్రభుత్వానికి రుచిచూపిస్తామని వెల్లడించారు. మోదీ పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో వివక్షత కొనసాగుతుందని ఆరోపించారు.
దేశంలోని 75 కోట్ల మంది బీసీల మనోభావాలను కించపరిచారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించేలా తక్షణమే మోదీ ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులతో సమావేశమై సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, జబ్బల శ్రీనివాస్, గుజ్జ సత్యం, సూర్యనారాయణ, నీలం వెంకటేశ్, కోల జనార్ధన్, భూపేశ్ సాగర్, రాజ్కుమార్, సుధాకర్, నందగోపాల్, రామకృష్ణ, బి.కృష్ణ, శివమ్మ, రమాదేవి,కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.