ముషీరాబాద్, ఫిబ్రవరి 4: చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, బీసీ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ 8, 9వ తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నగరం విద్యానగర్లోని బీసీ భవన్లో ‘చలో ఢిల్లీ’ వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన చేపట్టనున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50% టికెట్లు ఇవ్వాలని, బీసీలకు అన్యాయం చేసే పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్ను ఎత్తివేయాలని కోరారు. బీసీ పారిశ్రామిక పాలసీలో కోటా పెంచాలని తదితర డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.