చిక్కడపల్లి, మార్చి 26: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేవిధంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం సాగే పోరాటంలో వీరశైవ లింగాయత్లు ముందుండాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, గౌరవ అధ్యక్షుడు పటోళ్ల సంగమేశ్వర్, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ పాల్గొన్నారు.