రవీంద్రభారతి, సెప్టెంబర్ 4: ప్రభుత్వ పెద్దల సోదరులు బీసీల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని బీసీ సంఘాల నేతలు స్పష్టంచేశారు. ఈ మేరకు బషీర్బాగ్ దేశోద్ధ్దారకభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మ, బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు రావుల కోల్ నరేశ్ ప్రజాపతి మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో సర్వే నంబర్ 22, 22/ఆ/శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంతంలో ఉన్న దామ అరుణ్కుమార్ భూమి విషయంలో జరుగుతున్న పరిణామాలపై వారు స్పందించారు.
బీసీల భూముల విషయంలో అధికార పార్టీ నేతలు కోర్టు కేసులు, పోలీసులను అడ్డుపెట్టుకొని బడుగు బలహీన వర్గాల భూములపై ప్రభుత్వ పెద్దల సోదరులు గద్దల్లా వాలుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంలో బీసీ సంఘాలుగా మున్సిపల్ కార్యాలయం, హైడ్రా కమిషనర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. దామ అరుణ్కుమార్ సుమారు 2 ఎకరాల భూమిని కిలారు మధుమతి, అల్లూరి నీలిమ, జూబ్లీహిల్స్ వాసులకు విక్రయించారని, కానీ చెల్లింపుల విషయంలో జాప్యం జరగడంతో న్యాయవాదుల సమక్షంలో సేల్డీడ్ చేసుకున్నారని తెలిపారు.
దామ అరుణ్కుమార్ పేరిట సేల్డీడ్ ఉన్న రెండెకరాల భూమికి సంబంధించి వివాదంలో ప్రభుత్వ పెద్దల సోదరులు తలదూర్చి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆ స్థలంలో ఉన్న చెట్టను రక్షించే విషయంలో కోర్టు ద్వారా అరుణ్కుమార్ అనుమతి పొందారని, అయినప్పటికీ సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ముందుస్తు నోటీసులు లేకుండా అరుణ్కుమార్ భూమిలోని ప్రహరీని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని పోలీసులు, మున్సిపల్ అధికారుల సమక్షంలో కూల్చివేశారని అగ్రహం వ్యక్తంచేశారు.