Southwest Monsoon | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రుతుపవన ద్రోణి శ్రీగంగానగర్, రోహతక్, హర్దోయ్, వారణాసి, రాంచీ, సాగర్ ద్వీపం మీదుగా ఆగ్నేయ దిశగా వాయువ్య బంగాళాఖాతం వైపునకు వెళుతూ సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉన్నదని, దీని ప్రభావంతో రాబోయే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయని వెల్లడించింది.
కొన్ని వారాలుగా మైదాన ప్రాంతాలు ఎండలతో ఉడికిపోగా, వర్షాలు కేవలం హిమాలయ పర్వత ప్రాంతాలకే పరిమితమయ్యాయి. రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్లీ బలపడనున్నాయని, వచ్చేవారం ప్రారంభంలో ఈశాన్య భారతదేశం నుంచి మొదలై క్రమంగా తూర్పు, మధ్య, ఉత్తర భారతదేశానికి విస్తరించనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
వాతావరణ నిపుణుల ప్రకారం.. భారతదేశం ప్రస్తుతం ‘బ్రేక్ మాన్సూన్’ దశను ఎదురొన్నది. ఈ సమయంలో వర్షాలు కురిపించే ద్రోణి ఉత్తర హిమాలయాల వైపు వెళ్లడం వల్ల మధ్య భారతదేశం పొడిబారిపోయింది. ఈ నెలలో బంగాళాఖాతంలో అతి తకువ అల్పపీడనాలు ఏర్పడటం, అరేబియా సముద్రపు గాలులు బలహీనపడటమే దీనికి కారణం. ఫలితంగా దేశవ్యాప్తంగా వర్షపాతంలో ఇప్పటివరకు 24 శాతం లోటు నమోదైంది. కురువాల్సిన 323.1 మి.మీ వర్షపాతానికిగాను కేవలం 244.6 మి.మీ నమోదైంది.