చేనేత,జౌళిశాఖ ఉపసంచాలకుడు శైలజారామయ్యార్
రాజన్న సిరిసిల్ల, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది బతుకమ్మ చీరలు అధునాతన డిజైన్లలో తయారు చేస్తున్నట్టు చేనేత,జౌళిశాఖ ఉప సంచాలకుడు శైలజారామయ్యార్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరమగ్గాల ఆసాములు, ఎస్ఎస్ఐ యూనిట్ యజమానులు, మ్యాక్స్ సంఘాల అధ్యక్షులతో ఆమె సమావేశమయ్యారు. మరమగ్గాల ఆధునీకరణలో భాగంగా రూ.20వేల వరకు అదనపు భారం పడుతుందని, గతంలో రూ.150గా ఉన్న యారన్ ధర ప్రస్తుతం రూ.190కి పెరిగిందని యజమానులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం శైలజారామయ్యార్ మాట్లాడుతూ.. ఆసాములపై అదనపు భారం పడకుండా ఉండేందుకు సంబంధిత నగదును రెండేండ్లపాటు సబ్సిడీ రూపంలో ఇస్తామని చెప్పారు. యారన్ ధర సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీఇచ్చారు.