హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ గ్రేటర్ హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ ఫొటో కాంటెస్ట్ పోస్టర్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తున్న యూనిట్ సభ్యులను అభినందించారు. ఆదివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. నాన్ ఫొటో జర్నలిస్టులకు కూడా పోటీలో పాల్గొనే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితను యూనిట్ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆనంద్ ధర్మాన, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అనిల్కుమార్, జనరల్ సెక్రటరీ వీరగోని రజినీకాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మొదటి బహుమతి రూ.21 వేలు
ఫొటో కాంటెస్ట్లో పాల్గొనేవారు 2021 లో తీసిన ఫొటోలనే పోటీలకు పంపాలని నిర్వాహకులు సూచించారు. ఫొటో జర్నలిస్టులకు ఉచిత ఎంట్రీ ఉంటుందని, నాన్ ఫొటో జర్నలిస్టులు రూ.500 ఫీజు చెల్లించాలని చెప్పారు. మొదటి బహుమతికి రూ.21 వేలు, ద్వితీయ రూ.15 వేలు, తృతీయ బహుమతికి రూ.11 వేలు అందజేస్తామని ప్రకటించారు. ఏడు కన్సోలేషన్ బహుమతులు ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనియన్ సెక్రటరీ రజినీకాంత్గౌడ్ను 80966 77013 నంబర్లో సంప్రదించాలని సూచించారు.