హైదరాబాద్, ఆగస్టు 18: ఈ రోజుల్లో చాలామంది చేతిలో నగదు లేకుండానే బయటకు వెళుతుంటారు. ఎందుకంటే ఏవి కొన్నా, వాటికి కేవలం స్కాన్ చేసి, యూపీఐ ద్వారా చెల్లించేయొచ్చు. ఈ యూపీఐ ఒక సదుపాయమేకాకుండా, ఉచితం కూడా. కానీ త్వరలో ఈ పరిస్థితి మారబోతున్నది. యూపీఐ లావాదేవీలపై సైతం ఫీజు విధించే అవకాశం ఉంది. ‘చెల్లింపు పద్ధతులపై చార్జీలు’ అనే అంశమై రిజర్వ్బ్యాంక్ ఒక చర్చాపత్రాన్ని తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ 3కల్లా ఈ పత్రంపై అభిప్రాయాలు, సూచనలు తెలియచేయాలని ప్రజల్ని కోరింది. జీరో చార్జీల బదులు తక్కువ చార్జీలు సమర్థవంతమైన ప్రత్యామ్నాయమా? యూపీఐ లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తే అవి లావాదేవీ శాతంగా ఉండాలా? లేక స్థిర మొత్తం ఉండాలా? లేదా చార్జీలను రెగ్యులేటర్ నియంత్రించాలా? లేక మార్కెట్ నిర్ణయానికి వదిలేయాలా…ఈ అంశాలపై అభిప్రాయాల్ని, సూచనల్ని ఆర్బీఐ కోరింది.
యూనీఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో పాటు ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ప్రిపెయిడ్ పేమెంట్ ఇనుస్ట్రుమెంట్స్ (పీపీఐలు) వంటి వివిధ చెల్లింపు సాధనాల చార్జీలకు సంబంధించి అన్ని అంశాలనూ ఈ చర్చాపత్రంలో పొందుపర్చారు. దీని ద్వారా అందుకున్న సూచనల్ని విధానాలు, వ్యూహాల రూపకల్పనకు ఉపయోగిస్తామని ఆర్బీఐ తెలిపింది.
సర్వీసులకు వ్యయం
డిజిటల్ పేమెంట్ సర్వీసుల్ని అందించే సంస్థలకు వ్యయాలవుతాయని, వాటిని వ్యాపారులు లేదా ఖాతాదారులు లేదా లావాదేవీలో భాగస్వామ్యం ఉన్నవారి నుంచి వసూలు చేయడం జరుగుతున్నదని గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ తెలిపింది. అయితే ఈ చార్జీలు సబబుగా ఉండి, డిజిటల్ చెల్లింపులకు అవరోధం కాకపోతే… ఖాతాదారులు వీటిని భరించడంలో నష్టాలు, లాభాలు రెండూ ఉన్నాయన్నది. డిజిటల్ చెల్లింపులపై చార్జీలకు సంబంధించి అన్ని అంశాలతో కూడిన ఒక చర్చాపత్రాన్ని తీసుకొస్తామన్నది. దానినే ఇప్పుడు విడుదల చేసింది.
రోజుకు 21 కోట్ల లావాదేవీలు
దేశంలో లావాదేవీల పరిమాణం ప్రకారం యూపీఐ అతిపెద్ద రిటైల్ పేమెంట్ వ్యవస్థ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం ఏడాదికాలంలో యూపీఐ ద్వారా 638.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. రోజువారీ 21 కోట్లకుపైగా లావాదేవీలు జరుగుతున్నాయి. యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల్లో రూ. 200లోపు విలువగలవి 50 శాతం మేర ఉంటున్నాయి. తక్కువ విలువగల లావాదేవీల్లో నగదు వాడకాన్ని తగ్గించడమే యూపీఐ లక్ష్యాల్లో ఒకటి. అయితే ఈ కనిష్ట విలువతో జరిగే లావాదేవీలే యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో అధిక సామర్థ్యాన్ని, వనరుల్ని వాడుకుంటున్నాయి. ఒక్కోసారి సిస్టమ్లోడ్ కారణంగా చెల్లింపులు విఫలమవుతుంటాయి కూడా.
చార్జీలు వేస్తే అంతే సంగతులు
ఆర్బీఐ చర్చాపత్రంపై ట్విట్టర్లో పలువురు కోపాన్ని వెళ్లగక్కారు. ‘ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్లుండవు, బ్యాంక్ల వద్ద రూ. 50 నోట్లుండవు, ఇక యూపీఐకి చార్జీలేస్తే ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు ఎలా దెబ్బతింటాయో చూడండి’ అంటూ ఒక యూజర్ విరుచుకుపడ్డాడు. యూపీఐ వాడకంపై చార్జీలు విధిస్త్తే మళ్లీ ప్రజలు నగదువైపే మళ్లుతారంటూ మరో యూజర్ హెచ్చరికచేశారు. ‘ఇది క్రెడిట్ కార్డ్పై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)లా వ్యాపారి చెల్లించేలా ఈ చార్జీ ఉండాలి. ఎందుకంటే వారంతా బిజినెస్మెన్ కదా, డబ్బు వేగంగా పొందడానికి వారే చెల్లించేలా ఈ చార్జీలు ఉండాలి’ అని ఒక యూజర్ అంటే ‘దానిపై 18 శాతం జీఎస్టీ వేస్తే సరి’ అని మరో యూజర్ వ్యంగ్యాస్త్రం సంధించాడు.