బ్యాంకుల కస్టమర్ సర్వీస్ పాయింట్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆదాయ వనరులుగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు సులభతరం అయ్యాయి. వీటిని నిర్వహిస్తూ మహిళలు నెలకు రూ. 20వేల నుంచి 60 వేల దాకా సంపాదిస్తున్నారు. ఆర్థికంగా బలపడుతూ ఆత్మగౌరవంతో బతుకుతున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): బ్రాంచీలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులకు బ్యాకింగ్ సేవలను చేరువ చేసేందుకు బ్యాంకులు కస్టమర్ సర్వీసు పాయింట్పేరుతో బిజినెస్ కరస్పాడెంట్లను నియమించుకుంటున్నాయి. వీరిని విలేజ్ లెవల్ ఎంట్రప్రెన్యూర్ (వీఎల్ఈ)గా పిలుస్తున్నారు. వీరి నియామక బాధ్యతలను బ్యాంకులు పలు సంస్థలకు కేటాయించాయి. స్త్రీనిధికి మొత్తం 964 గ్రామాలను కేటాయించారు. ఇతర ప్రైవేట్ సంస్థలు పురుషులకు అవకాశం కల్పిస్తుండగా, స్త్రీనిధి మాత్రం సర్వీస్ పాయింట్లను నడిపేందుకు పూర్తిగా మహిళలకే అవకాశం కల్పించింది. అలాగే, ఎక్కువ కమిషన్ కూడా ఇస్తున్నది. ఇప్పటివరకూ 745 గ్రామాల్లో ఎస్బీఐ, 219 గ్రామాల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) కస్టమర్ సర్వీసు పాయింట్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర సర్కారు రైతుబంధు, వడ్ల కొనుగోలు ద్వారా రైతుల ఖాతాల్లోకి జమచేసే మొత్తాన్ని వీటి ద్వారానే డ్రాచేసుకోవడంతో మహిళలకు పెద్దమొత్తంలో కమిషన్ అందుతున్నది. ఈ సర్వీసుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ చివరి నాటికి ఏకంగా రూ. 6 వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ కస్టమర్ సర్వీసు పాయింట్లను నిర్వహిస్తున్న మహిళలు నెలకు రూ. 20 వేలనుంచి 60 వేల వరకు ఆర్జించారు.
వీఎల్ఈగా ఎంపిక కావాలంటే మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉండాలి. ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఎంపికైనవారికి ప్రాథమికంగా శిక్షణ ఇస్తారు. బ్యాంకింగ్ రంగంపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్(ఇర్మ) పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని వీఎల్ఈలుగా ఖరారు చేస్తారు. వీరికి బ్యాంకు అధికారులు ప్రత్యేకంగా పాస్ వర్డ్ కేటాయిస్తారు. వీరు బ్యాంకుల తరహాలోనే డబ్బులు డిపాజిట్ చేయడం, డ్రా చేయడం, పాస్ బుక్ ప్రింట్ చేయడం, ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, రుణాల చెల్లింపులు చేస్తారు. కరోనా సమయంలో వీఎల్ఈలు ప్రజలకు మెరుగైన సేవలు అందించారు.
2008లో డ్వాక్రా గ్రూపులో చేరాను. 2014 వరకు వ్యవసాయ పనులు చేశా. స్త్రీనిధి ద్వారా ఎస్బీఐ కస్టమర్ సర్వీసు పాయింట్ ఏర్పాటు చేసుకున్నా. మొదటి మూడేండ్ల వరకు నెలకు రూ.2,500 ఆదాయం మాత్రమే వచ్చేది. ఇప్పుడు కోటికిపైగా లావాదేవీలు చేస్తున్నా. నెలకు రూ. 20వేలు సంపాదిస్తున్నా. స్త్రీనిధి నుంచి అవార్డు కూడా అందుకున్నా. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయడం నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది.
– బద్ధం శ్రీలత, ఆస్త గ్రామం, నిర్మల్ జిల్లా
నా భర్త సహకారంతో కస్టమర్ సర్వీస్ పాయింట్ నడిపిస్తున్నా. 8 ఏండ్లుగా దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నా. నమ్మకంగా సేవలు అందిస్తున్నా. దీంతో ఎక్కువమంది సేవలను వినియోగించుకుంటున్నారు. అత్యధికంగా లావాదేవీలు చేసినందుకు నేను ఇప్పటి వరకు స్త్రీనిధి అధికారుల నుంచి మూడుసార్లు, బ్యాంకర్ల నుంచి రెండుసార్లు అవార్డు తీసుకున్నా.
– సుమ, దుబ్బాక, సిద్దిపేట జిల్లా