బంజారాహిల్స్, అక్టోబర్ 12: వివేక్ అనే వ్యక్తి కోసం గుజరాత్ నుంచి వచ్చిన రూ.2 కోట్ల హవాలా డబ్బును టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్లో స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేయడంతో హవాలా సొమ్ము కట్టలు కట్టలుగా బయటపడుతున్నది. నాలుగురోజుల కిందట జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండున్నర కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు తాజాగా మంగళవారం రాత్రి మరో రూ.2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఆకాశ్ కాంతి కొరియర్ అండ్ పార్సిల్ సంస్థకు చెందిన ఉద్యోగులు అజిత్ థాకర్ అలియాస్ కరణ్ (39), దిలీప్సింగ్ చౌహాన్ (40), మహేంద్ర సింగ్(26), పర్మార్ సందీప్ కుమార్ మంగళవారం అర్ధరాత్రి ఓ కారులో రూ.2 కోట్ల హవాలా సొమ్ముతో వివేక్ అనే వ్యక్తి కోసం వేచి ఉన్నారు. సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివేక్ అనే వ్యక్తికి ఈ నగదు అందించేందుకు వేచి చూస్తున్నామని చెప్పారు. ఆ వివేక్ ఎవరనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొరియర్ సంస్థ ముసుగులో హవాలా రాకెట్ నడుపుతున్న ఆకాశ్ కాంతి కొరియర్ సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.