బంజారాహిల్స్, నవంబర్ 29: ఫిలింనగర్లోని దక్కన్ కిచెన్ లీజు వ్యవహారంలో నమోదైన కేసులో నిందితుడు నందకుమార్ అలియాస్ నందు పోలీస్ కస్టడీ ముగిసింది. నందకుమార్ను రెండురోజుల పాటు విచారించిన బంజారాహిల్స్ పోలీసులు, మంగళవారం సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడ జైలుకు తరలించారు. నటుడు దగ్గుబాటి వెంకటేశ్కు చెందిన స్థలాన్ని డబ్ల్యూ 3 హాస్పిటాలిటీ సర్వీసెస్ సంస్థ లీజుకు తీసుకోగా, ఆ సంస్థలోకి నందకుమార్ ప్రవేశం, సబ్ లీజ్ ఇచ్చే అధికారం లేకుండా దక్కన్ కిచిన్ రెస్టారెంట్కు లీజుకు ఇవ్వడం తదితర అంశాలపై పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం.
2017లో తాను డబ్ల్యూ 3 హాస్పిటాలిటీ సంస్థలో డైరెక్టర్గా చేరానని, అంతకుముందు డైరెక్టర్గా ఉన్న ప్రమోద్కుమార్తోపాటు మరో డైరెక్టర్ తప్పుకోవడంతో తాను ఎండీగా బాధ్యతలు స్వీకరించానని నందకుమార్ చెప్పినట్టు తెలిసింది. సుమారు 20 నుంచి 25 ప్రశ్నలకు నందకుమార్ నుంచి వివరాలు రాబట్టారని సమాచారం. బంజారాహిల్స్ పోలీసులతో పాటు సిట్ అధికారులు రెమా రాజేశ్వరి, శ్రీధర్, ఆశిష్రెడ్డి కూడా నందకుమార్ను విచారించినట్టు తెలిసింది. కస్టడీ గడువు ముగియడంతో మంగళవారం సాయంత్రం అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు.