హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9(నమస్తే తెలంగాణ): ఓ బాలికను ట్రాప్ చేసి పోక్సో కేసు దాకా తెచ్చుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్ తీరు మొదటినుంచీ ఇదే రీతిలో ఉండేదని తెలుస్తున్నది. తన తండ్రి అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని తాను చదువుకున్న సమయంలో కళాశాలలో అనేక ఆగడాలకు పాల్పడ్డాడని ఆయనతో చదువుకున్న వారే చెప్పుకొంటారు. 2023 జనవరిలో మహీంద్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఓ జూనియర్ విద్యార్థిని భగీరథ్ ర్యాగింగ్ చేసిన ఓ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.
ఆ వీడియోలో భగీరథ్ కొందరు విద్యార్థులను నోటికొచ్చినట్టు తిడుతూ, కాళ్లతో తన్నుతూ చేసిన హంగామా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఎట్టకేలకు దుండిగల్ పోలీసులు అప్పట్లో బండి సాయిభగీరథ్పై ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిరోధక చట్టం-1997లోని సెక్షన్-4(ii) కింద కేసు నమోదు చేశారు. ఆ ఘటనపై అప్పట్లో యూనివర్సిటీ వర్గాలు సైతం అంతర్గత విచారణ జరిపి భగీరథ్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఒక ఎంపీ కుమారుడే ఇలా దాడులకు పాల్పడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని జనం దుమ్మెత్తి పోశారు. ఈ కేసు సంజయ్కు తలనొప్పి తెచ్చిపెట్టింది. అప్పుడు కూడా మొదట్లో తన కొడుకును ర్యాగింగ్ కేసు నుంచి తప్పించేందుకు బండి సంజ య్ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు.
2023 మార్చిలో తెలంగాణ హైకోర్టు భగీరథ్ సస్పెన్షన్పై స్టే ఇచ్చింది. అనంతరం దాడికి గురైన బాధిత విద్యార్థి సైతం తనకు భగీరథ్పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, నిందితుడిని క్షమిస్తున్నట్టు పేర్కొంటూ ఇరువర్గాలు లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవడంతో ఈ కేసుకు తెరపడింది. తన తండ్రి కేంద్ర సహాయమంత్రి అయ్యాక భగీరథ్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని తాజాగా కేసు నమోదైన తర్వాత బండి సన్నిహితులే మాట్లాడుకుంటున్నారు. తన జల్సాల కోసం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న భగీరథ్ మాట్లాడిన మాటల ఆడియో కూడా ఈ సందర్భంగా వైరల్ అయింది. అందులో ఆయన మాటతీరు, ఏడ్చిన వైనంపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. తాజాగా సాయి భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడం మరోసారి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.