హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పత్రికల్లో వార్తలు రావడానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా అంటూ సంజయ్ విసిరిన సవాల్పై కవిత స్పందించారు. పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. కిందిస్థాయి కార్యకర్త నుంచి ప్రధాని వరకూ పనిచేశారని, మరి అలాంటప్పుడు మమతా బెనర్జీ గెలువగానే ప్రధాని రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఉప ఎన్నికలో గెలువకుండా బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు. ప్రతి ఎన్నికకూ సవాల్చేయడం సరికాదని, రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరించాలని హితవుపలికారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు దేశంలో ఎవరూ గెలువలేదని గుర్తుచేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని పేర్కొన్నారు.