హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణా విషయంలో రాష్ట్రప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బాధితుల పునరావాసం కోసం రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎకనామిక్ సోషల్ స్టడీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన ‘మానవ అక్రమ రవాణా-నివారణ’ అనే అంశంపై నిర్వహించిన వర్షాప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అడ్డుకోవటంతోపాటు బాధితులకు సంరక్షణ, భద్రత, పునరావాసం కల్పించటానికి చట్టపరమైన, ఆర్థిక, సామాజిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నామని చెప్పారు.
గ్రామాల్లో బాలరక్షక కమిటీలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో చైల్డ్ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, కేవలం తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న పిల్లలు, తల్లిదండ్రి పోషించలేని పిల్లల బాధ్యతను రాష్ట్రప్రభుత్వమే తీసుకొని వారికి విద్యా, వైద్య పోషణ వసతి కల్పిస్తున్నదని వెల్లడించారు. దాదాపు 4 వేల మంది పిల్లలు ప్రభుత్వ పోషణలో ఉన్నారని తెలిపారు.
జిల్లాకు రూ.10 లక్షలతో ప్రత్యేక నిధి
ప్రతి జిల్లాలో బాండెడ్ లేబర్ రిహాబిలిటేషన్ కోసం రూ.10 లక్షల కార్పస్ఫండ్ జిల్లా కల్లెక్టర్ల వద్ద అందుబాటులో ఉన్నదని మంత్రి తెలిపారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండేలా గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీ భారతి హోళికేరి, రాష్ట్ర బాలల హకుల కమిషన్ చైర్మన్ జే శ్రీనివాసరావు, సభ్యుడు బృందాధర్రావు, కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్యాంసుందర్, అడిషనల్ ఎస్పీ అశోక్ కుమార్తోపాటు స్త్రీ, శిశు సంక్షేమ, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.