Balka Suman | హైదరాబాద్ : దళితులు, బీసీ మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుంటున్న ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ ఇలా లేదు. ఇది కొత్త సంప్రదాయం. గతంలో కుల సంఘం మీటింగ్లో పాల్గొని మేమే పరిపాలన చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, బీసీలు పాలించబడేటోళ్లు. మేం దేశ్ముఖ్లం.. పాలించేటోళ్లం అని రేవంత్ చెప్పారు. ఇవాళ అది ఆచరణలో చూపిస్తున్నారు.
ఎస్సీలకు డిప్యూటీ సీఎం, మంత్రి పదవి ఇచ్చి పెద్దపీట వేసినట్లు ప్రచారం.. కానీ ఆచరణకు వచ్చే వరకు కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకోవడం. విస్నూర్ రామచంద్రారెడ్డి, ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖల కోవలేనే ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఆలోచన, ఆచరణ ఉందన్నారు. వాటికి నిదర్శనమే ఇవాళ్టి సంఘటన. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ, బీసీ నాయకులు స్పందించాలి. కాంగ్రెస్ హైకమాండ్ కూడా స్పందించాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దళితుడిని నియమించామని చెప్పడం కాదు.. ఇక్కడ దళిత ఉప ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో అవమానం జరుగుతంటే ఊరుకోవడం సరికాదని బాల్క సుమన్ అన్నారు.