హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర డ్యామ్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న లోలెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)కు సమాంతరంగా మరో కాలువను తవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు బోర్డు మెంబర్గా తెలంగాణ ప్రభుత్వ ఆమోదం తెలపాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు. తుంగభద్ర డ్యామ్లో పూడిక పెరగటంతో పాటు, వరద ప్రవాహాల్లో వచ్చిన మార్పుల కారణంగా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 230 టీఎంసీల నీటిని వినియోగించుకొనే లక్ష్యంతో తుంగభద్ర డ్యామ్ను నిర్మించినప్పటికీ, ప్రస్తుతం 174.72 టీఎంసీలను కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. మొత్తంగా 55.28 టీఎంసీలను నష్టపోవాల్సి వస్తున్నదని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కొప్పల్ జిల్లా గంగావతి తాలుకాలో ఇప్పటికే 31 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నావలి రిజర్వాయర్ను 52 టీఎంసీలకు విస్తరించి, తుంగభద్ర డ్యామ్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వినియోగించుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఎల్ఎల్సీకి సమాంతరంగా మరో కాలువను తవ్వి తుంగభద్ర వరదను నావలికి తరలిస్తామని వివరించారు. ఇందుకు తుంగభద్ర బోర్డు ఆమోదం తప్పనిసరి అని, తమ ప్రతిపాదనకు బోర్డు మెంబర్గా తెలంగాణ అంగీకారం తెలపాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై చర్చించేందుకు వీలైతే బెంగళూరు రావాలని, లేదంటే అనుకూల తేదీని తెలిపితే తానే స్వయంగా వస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ ద్వారా కర్ణాటకలో 9,30,626 ఎకరాలు, ఏపీలో 6,25,097 ఎకరాలు, తెలంగాణలో 87వేల ఎకరాల ఆయకట్టు ఉన్నదని వెల్లడించారు.
సీఎం కేసీఆర్కు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై రాసిన లేఖలో పేర్కొన్న గణాంకాలు
తుంగభద్ర కేటాయింపులు 230 టీఎంసీలు
ప్రస్తుత వినియోగం 174.72 టీఎంసీలు
పూడిక కారణంగా నష్టం 55.28 టీఎంసీలు
కర్ణాటకలో ఆయకట్టు 9,30,626 ఎకరాలు
ఆంధ్రప్రదేశ్లో ఆయకట్టు 6,25,097 ఎకరాలు
తెలంగాణలో ఆయకట్టు 87,000 ఎకరాలు