హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో అమలైన బాలామృతం ప్లస్ను మరో 7 జిల్లాలకు ప్రభుత్వం విస్తరిస్తున్నది. రాష్ట్రవాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ప్రస్తుతం అందిస్తున్న బాలామృతం స్థానంలోనే బాలామృతం ప్లస్ను కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రెండేండ్ల క్రితం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, ఇదే విధానాన్ని నాగర్కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖ బాలామృతం ప్లస్ అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో భాగస్వాములకు రెండు దశల్లో శిక్షణ పూర్తిచేసింది. ఈ 7 జిల్లాల్లోని దాదాపు 10 వేల అంగన్వాడీల నిర్వహణలో భాగస్వాములైన సీడీపీవో, అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్/ఆయాలకు శిక్షణ పూర్తిచేశారు. అతి తీవ్ర లోప పోషణ (ఎస్ఏఎం), తక్కువ లోప పోషణ (ఎంఏఎం) అనే రెండు క్యాటగిరీలుగా విభజించి ఈ బాలామృతం ప్లస్ను ఆ రెండు జిల్లాల్లో అమలు చేశారు. రాష్ట్రంలో 0-5 ఏండ్ల వరకు ఉన్న పిల్లల్లో 18.1 శాతం తక్కువ పోషణ లోపం, 4.8 శాతం అతి తీవ్ర పోషణ లోపంతో ఉన్నారని సర్వేలు స్పష్టంచేశాయి. ఈ దుస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దశలవారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సహకారంతో ప్రస్తుతం అమలు అవుతున్న బాలామృతం పౌష్టికాహారానికి అదనపు పోషకవిలువలు అందించే బాలామృతం ప్లస్ను రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన విషయం తెలిసిందే.
చిన్నారుల్లో వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల లేకపోవడం, పిల్లల్లో ఆకలి లేకపోవడం, కుంగిపోయినట్టు ఉండటం, మరుగుజ్జుతనంతో ఉండటం, శరీరం పాలిపోయినట్టు ఉండటం, పాదాలకు నీరు రావడం, పిల్లల్లో ఆకలి సన్నగిల్లడం, విసర్జన వ్యవస్థ సరిగా లేకపోవడం (తినగానే విసర్జనకావడం, లేదా అదేపనిగా విరేచనాలు కావడం) మొదలైన లక్షణాలతో ఇబ్బంది పడే చిన్నారుల వివరాలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నాయి. ఈ వివరాల ఆధారంగా తొలిదశలో రెండు జిల్లాల్లో అందిస్తున్న బాలామృతం ప్లస్ను.. ఈ ఏడాది నుంచి 7 జిల్లాలకు విస్తరించేందుకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యాచరణ రూపొందించింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో (973 అంగన్వాడీ కేంద్రాలు) బాలామృతం ప్లస్తో దాదాపు 4 వేల మంది చిన్నారుల ఆరోగ్య ఎదుగుదలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈ పథకాన్ని మరో 7 జిల్లాల్లో దాదాపు 10 వేల అంగన్వాడీ కేంద్రాల్లో 50 వేల మంది చిన్నారులకు బాలామృతం ప్లస్ను అందించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. జాతీయ కుటుంబ సర్వే-5 ప్రకారం రక్తహీనతతోపాటు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, పొడవు మొదలైన అంశాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఉన్నదని తేల్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకించి ఆదివాసీ, గిరిజన ఆడబిడ్డల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నదని గ్రహించిన ప్రభుత్వం వీరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా బలమైన పోషక విలువలతో కూడిన సమతుల ఆహారాన్ని అందించాలని సంకల్పించింది. ఇందులో భాగంగాన 9 జిల్లాలను ఎంపిక చేసి చిన్నారులకు బాలామృతం ప్లస్ను అందించనున్నది.