హైదరాబాద్: దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సీనియర్ నటుడు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రామకృష్ణ, సుహాసినితోపాటు నందమూరి కుటుంబీకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ను మరిచిపోరని తెలిపారు.
సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారని, మాట తప్పని వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని వెల్లడించారు. తెలుగుదేశం రూపంలో తమకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని చెప్పారు.