హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచం మొత్తం అత్యాధునిక ‘బయో ఫార్మాస్యూటికల్స్’ రంగంవైపు చూస్తున్నది. దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధులకు ఈ రంగం పరిష్కారం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా బయో హబ్ను ఏర్పాటుచేయడానికి రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటుచేయనున్న బీ హబ్కు సంబంధించిన నమూనా చిత్రాలను ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆదివారం విడుదలచేశారు. ప్రస్తుతం బయోఫార్మా మార్కెట్ విలువ సుమారు రూ.15 లక్షల కోట్లు. ఏటా 15 శాతం వృద్ధి సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు, పరిశోధన సంస్థల్లో దాదా పు 40% బయో ఫార్మాస్యూటికల్స్పై దృష్టిసారించారు. ఇప్పటికే ప్రపంచ ఫార్మా దిగ్గజంగా ఉన్న మనదేశం.. ‘బయోఫార్మా’లోనూ అడుగుపెట్టి లీడర్గా ఎదగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే మన దేశంలో అనేక అంతర్జాతీయ స్థాయి ఫార్మా సంస్థలు కొలువుదీరాయి. బయోఫార్మా పరిశోధనలు చేపట్టాలంటే ఇప్పుడున్న ల్యాబ్లకు భిన్నంగా.. ప్రత్యేకంగా ఒక ల్యాబ్ను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. మూల పదార్థాలను గుర్తిం చి, సేకరించి, వాటిని సమర్థంగా ప్రాసెస్ చేసి, పరిశోధనలు జరిపి నాణ్యమైన ఔషధాన్ని ఉత్పత్తిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కంపెనీలు ఓవైపు పరిశోధనలతోపాటు మరోవైపు మార్కెటింగ్ వ్యూహాలు, అనుమతుల ప్రక్రియను సమర్థంగా నిర్వహించాల్సి ఉంటుంది. కంపెనీలకు ఈ శ్రమను తగ్గించేలా, స్టార్టప్లను ప్రోత్సహించేలా సకల వసతులతో, శాస్త్రవేత్తలు సౌకర్యవంతంగా పరిశోధనలు చేయగలిగేలా అత్యాధునిక ల్యాబొరేటరీ మన దేశంలో ఎక్కడాలే దు. దీనికి సమాధానమే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ‘బయోఫార్మా హబ్’. సంక్షిప్తంగా బీ-హబ్ అని పిలుస్తున్నారు.
జినోమ్వ్యాలీలో ఏర్పాటు
ఈ హబ్ను జీనోమ్ వ్యాలీలో ఏర్పాటుచేస్తున్నారు. ఇక్కడ సెల్ కల్చర్ మొదలు ఫిల్టరేషన్ యూనిట్లు, క్రొమాటోగ్రఫీ ప్రాసెసింగ్.. ఇలా పరిశోధనలు, ‘ప్రీ క్లినికల్ ట్రయల్స్’ చేసేలా సకల వసతులు ఉంటాయి. స్టార్టప్లతోపాటు, మధ్యస్థాయి కంపెనీలు, పెద్ద పెద్ద ఫార్మా సంస్థలు సైతం ఇక్కడ పరిశోధనలు చేసేందుకు సదుపాయాలు ఉంటాయి. దీంతో ఆయా సంస్థలు ఒకేసారి పెద్ద మొత్తంలో వెచ్చించి ల్యాబ్లు ఏర్పాటు చేసుకొనే భారం తప్పుతుంది. అంతేకాకుండా సమయం భారీగా కలిసివస్తుంది. తద్వారా వేగంగా పరిశోధనలు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు అవకాశం కలుగుతుంది.
హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీకి కేంద్ర బిందువుగా ఉన్నది. ఐఐసీటీ, సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింగ్ డయాగ్నోస్టిక్స్ వంటి కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలు, 800కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి.
బయోఫార్మాకు తెలంగాణ నాయకత్వం
భారతదేశంలో మొట్టమొదటి గ్రోత్-ఫేజ్ సెంటర్, బయోఫార్మా స్కేల్ అప్ తయారీ కేంద్రమైన బీ-హబ్ నమూనా ఫొటోలను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్లో విడుదలచేశారు. ‘హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మరో 15 నెలల్లో ప్రారంభం కానున్న బీ-హబ్ బయోఫార్మా రంగంలో తెలంగాణ నాయకత్వం వహించేలా చేస్తుంది’ అంటూ ఆయన ట్వీట్చేశారు.
ఫార్మా హబ్ హైదరాబాద్
దేశ ఫార్మా ఉత్పత్తుల్లో మూడింట ఒకవంతు హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. అమెరికా ఆహార సంస్థ (ఎఫ్డీఏ) ఆమోదించిన ఔషధాల్లో 30 శాతం హైదరాబాద్వే. అంతేకాదు.. ప్రపంచ వ్యాక్సిన్ హబ్గానూ హైదరాబాద్ వెలుగొందుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 33 శాతం ఇక్కడి నుంచే వస్తూ ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షిస్తున్నాయి. జినోమ్ వ్యాలీ ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్, ఫార్మా ఇన్నోవేషన్ క్లస్టర్గా ఎదిగింది. ఇంతటి అద్భుతమైన వ్యవస్థను మరింత బలోపేతంచేసేందుకు, భవిష్యత్తులోనూ లీడర్గా కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఇందుకోసం బయో ఫార్మారంగంలో పరిశోధనలు, ఉత్పత్తిపై దృష్టి సారించింది. దేశంలోనే మొదటిసారిగా జీనోమ్వ్యాలీలో తరువాతి తరం ల్యాబొరేటరీ ‘బీ-హబ్’ను ఏర్పాటుచేస్తున్నది. ఫార్మా కంపెనీలు ఇక్కడి అత్యాధునిక వసతులను ఉపయోగించుకొని పరిశోధనలు చేయవచ్చు. కంపెనీలు పరస్పరం సహకరించుకోవచ్చు.