హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య శ్రీ వంటి సొంత ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్న రాష్ర్టాల్లో ప్రత్యేకంగా ఆయుష్మాన్భారత్ కార్డులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజస్థాన్ సహా అనేక రాష్ర్టాలు ఆయుష్మాన్భారత్ కార్డులు మంజూరు చేయటం లేదంటూ రాజస్థాన్కు చెందిన ఎంపీ రాహుల్ కస్వాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా సమాధానం ఇచ్చింది. ఆయుష్మాన్భారత్ కింద దేశవ్యాప్తంగా 60 కోట్ల మందికి కవరేజీ ఇస్తున్నట్టు తెలిపింది. కొన్ని రాష్ర్టాలు సొంతంగా ఆరోగ్య పథకాలు అమలు చేస్తూ అదనంగా 15.5 కోట్ల మందికి కవరేజీ ఇస్తున్నట్టు పేర్కొన్నది. ఇలా సొంత ఖర్చుతో పథకాలు అమలు చేస్తూ, ఆయుష్మాన్భారత్తో అవగాహన ఒప్పందం చేసుకున్న రాష్ర్టాల్లో ప్రత్యేకంగా ఆయుష్మాన్భారత్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
వదంతులు నమ్మవద్దు
ఆయుష్మాన్భారత్ కార్డు ఉంటేనే ఉచిత వైద్యం అందుతుందని రాష్ట్రంలో కొందరు వదంతులు సృష్టిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ చివరి గడువు అంటూ ఆందోళనకు గురిచేస్తున్నారు. దీంతో చాలా మంది ఇంటర్నెట్ సెంటర్లు, మీసేవ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్భారత్ కలిపి అమలవుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా కార్డులు అవసరం లేదు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మి డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని అధికారులు కోరుతున్నారు.