దేవరుప్పుల, ఆగస్టు 22 : నేషనల్ హెల్త్ మిషన్లో పథకంలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి రూ. 20లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (పల్లె దవాఖాన) మంజూరైంది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి సరిగ్గా ఏడాది క్రితం ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ పనులు బేస్మెంట్ లెవల్లోనే ఉండటంతో శనివారం బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు తాటిపట్టి మహేశ్ నేతృత్వంలో పలువురు నాయకులు శిలాఫలకానికి వార్షికోత్సవం నిర్వహించారు. మహేశ్ మాట్లాడుతూ..
గ్రామంలో ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో గ్రామపంచాయతీలోనే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాదైనా భవన నిర్మాణం పూర్తి చేయాలని, లేకపోతే రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శిలాఫలకాలు వేయడం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ హయాంలో పూర్తిచేసిన పనులను ప్రారంభించడమే సరిపోతున్నదని తెలిపారు.