మొయినాబాద్, అక్టోబర్ 17: విదేశీ ఉన్నత విద్యను అభ్యసించాలనుకొంటున్న ఇంజినీరింగ్ విద్యార్థులు స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజుల్ హసన్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని జోగిన్పల్లి భాస్కర ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (జేబీఐఈటీ) కళాశాలలో ‘నమస్తే తెలంగాణ‘, ‘తెలంగాణ టుడే’ దినపత్రికల ఆధ్వర్యంలో ‘అవేర్నెస్ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’ సదస్సును వై యాక్సిస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో నిర్వహించారు.
ఈ సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఫైజుల్ హసన్ మాట్లాడుతూ.. విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందడానికి ఇంజినీరింగ్ విద్యార్థులు సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నప్పుడే ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. విదేశీ విద్యతోపాటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాలనుకొనేవారు కూడా వీసా విధానంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
వై యాక్సిస్ సొల్యూషన్స్ సంస్థ విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారికి మార్గదర్శనం చేస్తుందని చెప్పారు. విద్యార్థులు ఏ దేశానికి వెళ్లాలన్నా వైయాక్సిస్ కన్సల్టెంట్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకొన్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికలు ఈ మంచి కార్యక్రమానికి పూనుకొన్నాయని ప్రశంసించారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు మూడవ ఏడాది నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అవగాహన లేకపోతే వీసా పొందడానికి చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందని వివరించారు. 1990లో ప్రారంభమైన వై యాక్సిస్కు దేశవ్యాప్తంగా 60 కార్యాలయాలతోపాటు దుబాయ్, షార్జా, మెల్బోర్న్, సిడ్నీలో 1,500 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని, పది లక్షల మంది కస్టమర్లకు సేవలందించామని చెప్పారు.
వలస ఉద్యోగ, విద్యావీసాల కోసం ప్రతి నెలా దాదాపు 40 వేల మందికి వ్యక్తిగత కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు వెల్లడించారు. వైయాక్సిస్ ద్వారా ప్రతి నెలా వేల మంది విదేశాలకు వెళ్తున్నారని, వారికి ఆరేడు నెలలపాటు శిక్షణ ఇచ్చి, వీసాలు అందించి విదేశాలకు పంపుతున్నట్టు తెలిపారు. విదేశీ విశ్వవిద్యాలయాలు నిర్వహించే పరీక్షలు, వీసా ఇంటర్యూలు, విదేశీ చదువుల వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో జేబీఐఈటీ కళాశాల డైరెక్టర్ యూవీఎస్ఎన్ మూర్తి, కంప్యూటర్ సైన్స్ డీన్ డాక్టర్ నీరజ్ ఉపాధ్యాయ, అడ్మినిస్ట్రేషన్ డీన్ డాక్టర్ హిమాన్షుశర్మ, సీజీసీ కో ఆర్డినేటర్ డాక్టర్ నర్సప్పరెడ్డి, తెలంగాణ పబ్లికేషన్స్ మేనేజర్ టీ గణేశ్, ప్రతినిధి మహేశ్, అధ్యాపకులు, మూడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విదేశీ విద్యపై సంపూర్ణ అవగాహన
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు ఇలాంటి సదస్సులు నిర్వహించడం సంతోషకరం. విదేశీ విద్యపై అవగాహన పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా విషయాలు చక్కగా చెప్పారు. విద్యార్థులకే కాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి, వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సదస్సు చాలా ఉయోగపడుతుంది.
– డాక్టర్ పీసీ కృష్ణమాచారి, ప్రిన్సిపల్, జేబీఐఈటీ కళాశాల, మొయినాబాద్