హైదరాబాద్, ఆగస్టు, 27 : దేశీ ఆవు జాతుల్ని విదేశీ ఆవు జాతులతో కృత్రిమ గర్భధారణ పద్ధతుల నివారణకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను క్లిమామ్ వ్యవస్థాపకురాలు, సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్ అల్లోల దివ్యారెడ్డి కోరారు. సేవ్ దేశి కౌస్ ప్రచారంలో (save desi cows campaign) భాగంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను ఆదర్శనగర్ క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
కృత్రిమ గర్భధారణ వల్ల మన దేశీ ఆవు జాతులు ఎన్నో అంతరించి పోతున్నాయని, కాలక్రమేణా మన దేశవాళీ ఆవులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వివరించారు. మన రాష్ట్ర బ్రీడింగ్ పాలసీలో తగిన మార్పులు తీసుకు వచ్చి మన దేశవాళీ గో సంపదను పరిరక్షించాలని ఆమె కోరారు.
ఇదే విషయమై మన గోసంపద కు పునర్వైభవం తీసుకురావడానికి తాను సుప్రీం కోర్టులో మే నెలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశామని, ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ లు జారీ చేసిందని మంత్రికి వివరించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి..దేశవాళీ అవుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఎస్.రాంచందర్ను కలిసి ఇదే అంశాన్ని ఆయనకు వివరించారు.