ఆకాశమే హద్దుగా తెలంగాణలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధి
హైదరాబాద్ మొబిలిటీ వ్యాలీలో పలు కంపెనీల పెట్టుబడులు
వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్లో
ఫార్ములా-ఈ ఎలక్ట్రిక్ వాహనాల రేస్, ఈవీ సమ్మిట్ నిర్వహణ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడి
కోకాపేటలో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని, దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయని, వాహనాల్లో ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ వినియోగం గణనీయంగా పెరగడంతో ‘కంప్యూటర్ ఆన్ ఫోర్ వీల్స్’గా ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందిందని చెప్పారు. అమెరికన్ సంస్థ అడ్వాన్స్ ఆటో పార్ట్స్ హైదరాబాద్లోని కోకాపేటలో ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన గూగుల్, ఫేస్బుక్, క్వాల్కమ్, ఉబర్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ తదితర కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని గుర్తుచేశారు. వీటితోపాటు జెడ్ఎఫ్, హ్యుండాయ్ లాంటి ఆటోమొబైల్ సంస్థలు తెలంగాణకు వస్తున్నాయని, ఇదే బాటలో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ సైతం హైదరాబాద్కు రావడం సంతోషాన్ని కలిగిస్తున్నదని చెప్పారు.
మొబిలిటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ రంగంలో ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్కు ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు. కాలుష్య సమస్యను అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని, గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో సస్టెయినబులిటీకి మంచి భవిష్యత్తు ఉన్నదన్నారు. 2070 నాటికి దేశంలో కర్బన ఉద్గారాలను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నదని మంత్రి కేటీఆర్ గుర్తుచేస్తూ.. ఈ లక్ష్యాన్ని తెలంగాణ ఎంతో ముందుగానే అధిగమిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణలో వివిధ రంగాలకు సంబంధించిన పలు సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నం దున అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఫార్ములా-ఈ ఈవెంట్ను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల రేస్ను, ఈవీ సమ్మిట్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వీటిలో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ కూడా పాల్గొనాలని, భవిష్యత్తులో మరిన్ని కేంద్రాలను విస్తరించాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. కార్యక్రమం లో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ ప్రెసిడెంట్, సీఈవో టామ్ గ్రెకో, అడ్వాన్స్ ఆటో పార్ట్స్ జీసీసీ ఇండియా ఎండీ మహేందర్ దుబ్బా పాల్గొన్నారు.
450 మందికి ఉద్యోగాలు
కోకాపేటలో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ 65 వేల చదరపు అడుగుల వైశాల్యాంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దీనిలో 450 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 2025 నాటికి కార్యకలాపాలను మరిం త విస్తరిస్తూ ఉద్యోగుల సంఖ్యను భారీగా పెం చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకొన్నది. అమెరికా వెలుపల ఆ సంస్థ స్థాపించిన అతి పెద్ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లలో ఇది రెండవది. అంతేకాకుండా నార్త్ కరోలినా (అమెరికా)లోని రాలీలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాల యం తర్వాత ఇదే అతిపెద్ద కార్యాలయం. సైప్లె చైన్ ఆప్టిమైజేషన్, కాంపిటీటివ్ ప్రైసింగ్, స్టోర్ ఆపరేషన్స్, కస్టమర్ ఇంటర్ఫేస్ తదితరాలకు సంబంధించిన ఆటోమోటివ్ సొల్యూషన్స్ను ఆవిష్కరించడంలో ఇది దోహదపడుతుంది.